కెప్టెన్ సూర్య వల్లే ఓడిపోయాం.. పాక్ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
- Author : Vamsi Chowdary Korata
Date : 16-02-2026 - 10:47 IST
Published By : Hashtagu Telugu Desk
IND VS PAK భారత్ – పాక్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 175 పరుగులు చేస్తే.. పాకిస్తాన్ కేవలం 114 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, బలమైన పాక్ స్పిన్ విభాగాన్ని ఎదుర్కోవడంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పాత్ర చాలా కీలకం. పాక్ స్పిన్ విభాగంలో ఏకంగా 5 ఓవర్లు బ్యాటింగ్ చేసి, అనవసరంగా వికెట్ కోల్పోకుండా సూర్య కుమార్ యాదవ్ చేశాడు. ఈ విషయాన్ని పాక్ కెప్టెన్ కూడా అంగీకరించాడు.
- స్పిన్నర్లు విఫలమయ్యారన్న పాక్ కెప్టెన్
- వికెట్లు పడకుండా కాపాడిన భారత కెప్టెన్ సూర్య
- టీమిండియా విజయంలో స్కై పాత్ర చాలా కీలకం
టీ20 వరల్డ్కప్లో భారత్-పాక్ మ్యాచ్ అంటేనే ఓ హై టెన్షన్. అయితే, కొలంబో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో టీమిండియా సునాయాస విజయం సాధించింది. అందరికీ ఇది సునాయాస విజయంలా కనిపించినా.. బలమైన పాక్ స్పిన్ వ్యవస్థను ఛేదించి భారత జట్టుకు విజయాన్ని అందించింది మాత్రం కెప్టెన్ సూర్యకుమార్ యాదవే. ఆరంభంలో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన చేసినా.. ఆ తర్వాత మ్యాచ్ని నిలబెట్టింది భారత జట్టు సారథే. ఈ మ్యాచ్లో సూర్య సైలెంట్గా ఎలా దెబ్బ కొట్టాడో పాక్ కెప్టెన్ చాలా క్లియర్గా చెప్పేశాడు.
ప్రపంచంలో ఏ జట్టు ఆడలేని విధంగా ఏకంగా ఆరుగురు స్పిన్నర్లతో పాకిస్తాన్ జట్టు బరిలోకి దిగింది. నిజం చెప్పాలంటే పాక్ స్పిన్నర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. కానీ కెప్టెన్ సూర్య ప్లానింగ్, ఎగ్జిక్యూషన్తో సీన్ మొత్తం రివర్స్ అయింది. అది ఎలా అనుకుంటున్నారా? పాకిస్తాన్ మిస్టీరియస్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ అనుకున్న విధంగా వికెట్లు తీయలేకపోయాడు. దీనికి ప్రధాన కారణం సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగే!
ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ను ఎక్కువగా ఎదుర్కొంది సూర్యకుమార్ యాదవే. తిలక్ కాస్త ఇబ్బంది పడినా సూర్య చాలా కాన్ఫిడెంట్గా ఆడాడు. పరుగులు రావడం తగ్గినా వికెట్లు మాత్రం కోల్పోలేదు. సహనం కోల్పోకుండా ఆడిన సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 32 పరుగులు చేసి 19వ ఓవర్ ఆఖర్లో వికెట్ కోల్పోయాడు. అది కూడా భారీ షాట్కు ప్రయత్నించి వికెట్ చేజార్చుకున్నాడు.
పిచ్ గురించి అవగాహన, ఎన్ని పరుగులు చేయాలి, తారిఖ్ను ఎదుర్కోవడానికి ఏం చేయాలి అనే విషయంలో సూర్య ప్రాక్టీస్ సెషన్లో మిగతా బ్యాటర్లకు తారిఖ్లా బౌలింగ్ చేసి మరీ చూపించాడు. 20 ఓవర్లకు గానూ దాదాపు 5 ఓవర్లు తనే బ్యాటింగ్ చేయడం. ఇవన్నీ కలిసి పాక్ స్పిన్నర్లు ఏమాత్రం ప్రభావం చూపకుండా చేయగలిగాడు. సూర్య- తిలక్ కలిసి 15వ ఓవర్ వరకు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో పాక్ స్పిన్నర్లు పొదుపుగా బౌలింగ్ చేయగలిగారే కానీ వికెట్లు తీయలేకపోయారు. ఇది మ్యాచ్ గమనాన్ని మార్చేసింది.
భారత్తో మ్యాచ్లో ఓటమి తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మాట్లాడుతూ “మా స్పిన్నర్లపై మాకు పూర్తి నమ్మకం ఉంది. గత ఆరు నెలల్లో వాళ్లు చాలా బాగా ఆడారు. కానీ ఈరోజు వాళ్లకు ఆఫ్ డే వచ్చింది. కొన్ని కీలక సందర్భాల్లో ఎగ్జిక్యూషన్ సరిగా జరగలేదు. బ్యాటింగ్లో మేం సరిగా ఆరంభం చేయలేకపోయాం. టీ20 మ్యాచ్ల్లో పవర్ప్లేలో 3 లేదా 4 వికెట్లు కోల్పోతే, అప్పటి నుంచి మ్యాచ్ని వెంబడించాల్సిందే. టాస్ గెలిచి రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. నిజం చెప్పాలంటే, మొదటి ఇన్నింగ్స్లో పిచ్ కొంచెం స్టికీగా ఉంది. బంతి బాగా గ్రిప్ అవుతోంది. అందుకే ఛేజింగ్ బాగుంటుందని అనిపించింది. కానీ రెండో ఇన్నింగ్స్లో పిచ్ కొంచెం మెరుగ్గా ఆడింది. అయినా మా బౌలర్లు పరిస్థితికి తగ్గట్టు బౌలింగ్ చేయలేదు.
బ్యాటింగ్లో కూడా మేం మమ్మల్ని మేమే సరిగా అప్లై చేసుకోలేదు. మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లే అవకాశం మేం మాకే ఇవ్వలేదు. ఇలాంటి పెద్ద మ్యాచ్ల్లో భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోవాలి. మేం ఇలాంటి మ్యాచ్లు చాలానే ఆడాం, కాబట్టి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. ఇప్పుడు మేం చాలా త్వరగా మళ్లీ ఫోకస్ కావాలి. రెండు రోజుల్లో మరో మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ మాకు చాలా కీలకం. దాన్ని గెలవాలి, సూపర్ ఫోర్కు అర్హత సాధించాలి. ఆ తర్వాత నుంచి కొత్త టోర్నీ మొదలైనట్టే. పెద్ద దృశ్యాన్ని చూస్తూ ముందుకు వెళ్లాల్సిందే” అని అన్నాడు.
Tags
- cricket news
- cricket news India
- Cricket Team India
- ICC Cricket News
- ICC T20 World Cup 2026
- ind vs pak
- IND vs PAK Match
- Indian cricket news
- Latest Cricket News
- Pakistan Spinners
- Pakistani captain Shan Masood
- Shan Masood
- sports news
- Sports UpdatesCricket News
- Suryakumar Yadav
- Suryakumar Yadav (SKY)
- T20 World Cup 2026
- team india
- Telugu Cricket News
- Telugu Sports News