Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు
- Author : Vamsi Chowdary Korata
Date : 20-06-2026 - 10:41 IST
Published By : Hashtagu Telugu Desk
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయన సోమవారం నాడు న్యాయస్థానం ముందు స్వయంగా హాజరుకావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను ముంబైలో సినిమా షూటింగ్లో ఉన్నానని, అలాగే భద్రతా కారణాల దృష్ట్యా తనకు ఆన్లైన్ (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని అల్లు అర్జున్ కోర్టును అభ్యర్థించారు. అయితే, ఆయన దాఖలు చేసిన ఈ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. మొదటి విచారణకు నిందితులు లేదా సంబంధిత వ్యక్తులు స్వయంగా హాజరుకావాలనే నిబంధనను ఉటంకిస్తూ, కోర్టుకు రావడం మినహా వేరే మార్గం లేదని తేల్చిచెప్పింది.
కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎల్లుండి (సోమవారం) అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు రావడం ఖాయమైంది. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో కోర్టుకు వస్తుండటంతో అక్కడ భారీ ఎత్తున అభిమానులు, ప్రేక్షకులు గుమిగూడే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ముందస్తుగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో సినిమా ప్రమోషన్స్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, దాని వల్ల జరిగిన అవాంఛనీయ సంఘటనలపై నమోదైన కేసులో ఈ విచారణ జరగనుంది. ఈ మొదటి విచారణ అనంతరం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనే అంశంపై ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.