ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ జిల్లాలకు రూ.60.76 కోట్ల ఖేలో ఇండియా నిధులు మంజూరు..
- Author : Vamsi Chowdary Korata
Date : 09-01-2026 - 3:11 IST
Published By : Hashtagu Telugu Desk
Ap Sports Infrastructure And Construct Indoor Hall ఏపీకి కేంద్రం తీపికబురు వినిపించింది. ఖేలో ఇండియా పథకం కింద రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పనులు చేపట్టేందుకు రూ.60 కోట్లు నిధులు మంజూరు చేసింది. వీటి సాయంతో శ్రీకాకుళం జిల్లాలో ఇండోర్ స్పోర్ట్స్ హాల్, కుప్పంలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ బ్లాక్, రాజమండ్రిలో ఇండోర్ స్టేడియం నిర్మించనున్నారు. అలాగే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో తీపికబురు వినిపించింది. ఏపీలో క్రీడా రంగం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖేలో ఇండియా పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం రూ.60.76 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను ఉపయోగించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో క్రీడలకు సంబంధించిన మౌలిక వసతులను కల్పించనున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా పాత్రునివలసలో 14 కోట్లు రూపాయలు ఖర్చు చేసి ఒక ఇండోర్ స్పోర్ట్స్ హాల్ నిర్మించనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో మల్లీపర్పస్ ఇండోర్ బ్లాక్ నిర్మించనున్నారు. కుప్పంలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో 14 కోట్లు ఖర్చు చేసి ఈ మల్టీపర్పస్ ఇండోర్ బ్లాక్ నిర్మించనున్నారు.
అలాగే రాజమహేంద్రవరంలో 13 కోట్ల 76 లక్షల రూపాయలు ఖర్చు చేసి మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మించనున్నారు. వీఐ పురంలో దీనిని నిర్మించనున్నారు. అలాగే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.9.50 కోట్లు కేటాయించారు.అలాగే ఆరు కోట్లు ఖర్చు చేసి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆర్టిఫిషియల్ గ్రాస్ ఫుట్ బాల్ ఫీల్డ్ సిద్ధం చేయనున్నారు. ఒకటిన్నర కోటి ఖర్చు చేసి టెన్నిస్ కోర్టు, 92 లక్షలతో బాస్కెట్ బాల్ కోర్టు నిర్మించనున్నారు. అలాగే విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 1.08 కోట్లు ఖర్చు చేసి 200 మీటర్ల ట్రాక్, బాస్కెట్ బాల్ కోర్టు, టెన్నిస్ కోర్టులకు ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు.
మరోవైపు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ, జనసేన పార్టీలు భాగస్వామిగా ఉండటంతో కేంద్రం నుంచి ఏపీకి మంచి సహకారం అందుతోంది. రాజధాని నిర్మాణంతో పాటుగా రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణంలో కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోంది. అలాగే వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రాష్ట్రానికి సహకారం అందిస్తోంది. ఈ క్రమంలోనే టూరిజం, స్పోర్ట్స్ రంగాలలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి సహకారం లభిస్తోంది. అందులో భాగంగా ఖేలో ఇండియా పథకం కింద ఈ రూ.60 కోట్లు నిధులు మంజూరు చేశారు.