Telegram Banned: టెలిగ్రామ్ యాప్పై బ్యాన్.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
- Author : Vamsi Chowdary Korata
Date : 19-06-2026 - 12:13 IST
Published By : Hashtagu Telugu Desk
నీట్ రీ-ఎగ్జామ్కు ముందు టెలిగ్రామ్ యాప్పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. పరిస్థితుల దృష్ట్యా కేంద్రం తీసుకున్న చర్య సమంజసమేనని స్పష్టం చేసింది.
ఈ అంశంపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ‘‘అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో తప్పు కనిపించడం లేదు’’ అని పేర్కొంది. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం కేంద్రం అనుసరించాల్సిన విధానాన్ని పాటించిందని తెలిపింది.
దేశంలో అత్యంత పోటీ ఉన్న ప్రవేశ పరీక్షల్లో నీట్ ఒకటి. ప్రతి ఏడాది 20 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాస్తుంటారు. ఈసారి పరీక్ష నిర్వహణపై వివాదం నెలకొనడంతో విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత నెల జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రం ముందుగానే బయటకు వెళ్లిందన్న ఆరోపణలు రావడంతో కేంద్రం రీ-ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించింది. కొన్ని టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా ప్రశ్నపత్రం చక్కర్లు కొట్టిందన్న ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి.
దీంతో జూన్ 21న జరగనున్న రీ-ఎగ్జామ్కు ముందు టెలిగ్రామ్కు యాక్సెస్ను కేంద్రం నిలిపివేసింది. ప్రశ్నపత్రాల లీక్, తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడమే లక్ష్యమని తెలిపింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న చర్య సమంజసమేనని అభిప్రాయపడింది. పరీక్షల పారదర్శకతను కాపాడడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని గుర్తు చేసింది.