Chandrababu Naidu: సింగపూర్కు సీఎం చంద్రబాబు.. రెండు రోజులు వరుస భేటీలు..!
- Author : Vamsi Chowdary Korata
Date : 13-06-2026 - 2:16 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్నారు. జూన్ 14 నుంచి సాగే ఈ పర్యటనలో రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు సమీకరించడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇందుకోసం రేపు ఉదయం బెంగళూరు నుంచి ఆయన సింగపూర్కు బయలుదేరుతారు. ముఖ్యమంత్రి వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ, పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనకు వెళ్లనున్నారు.
పర్యటనలో భాగంగా చంద్రబాబు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో పాటు ఆ దేశ ఉప ప్రధాని, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్, విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్, హోం మంత్రి షణ్ముగమ్ వంటి కీలక నేతలతో సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, ప్రభుత్వ విధానాలను వారికి వివరించనున్నారు. తొలుత సింగపూర్లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో భేటీ అయి పర్యటన అజెండాపై చర్చిస్తారు.
పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు గూగుల్ క్లౌడ్, జీఐసీ, వైసీహెచ్ లాజిస్టిక్స్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ కానున్నారు. స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ అధ్యక్షుడితోనూ సమావేశమై విద్యా రంగంలో భాగస్వామ్యంపై చర్చిస్తారు. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన అంశం రాజధాని అమరావతి. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించిన సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులతో అమరావతి ప్రణాళికపై ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
పర్యటనలో భాగంగా ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’లో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం 2026లో విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా ఏర్పాటు చేసిన బిజినెస్ రోడ్షోలో చంద్రబాబు పాల్గొంటారు. పర్యటన ముగించుకుని 16న రాత్రి 10 గంటలకు ఆయన తిరిగి స్వదేశానికి రానున్నారు. ముఖ్యమంత్రి వెంట పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, సీఆర్డీఏ అధికారుల బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటాయి.