టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కి రాజస్థాన్ రాయల్స్ నుంచి బంపర్ ఆఫర్లు!
- Author : Vamsi Chowdary Korata
Date : 17-02-2026 - 12:35 IST
Published By : Hashtagu Telugu Desk
Gautam Gambhir భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ భారీ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. సీఈవో, మెంటర్, భాగస్వామిగా చేరాలని ప్రతిపాదన చేసినట్లు సమాచారం. అయితే బీసీసీఐ నిబంధనలు, జాతీయ జట్టు బాధ్యతల కారణంగా ఈ ఆఫర్ను స్వీకరించడం కష్టమేనని తెలుస్తోంది. గంభీర్ భవిష్యత్పై ఈ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 వరకు గౌతమ్ గంభీర్ బీసీసీఐతో ఒప్పందంలో ఉండటం గమనార్హం.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఐపీఎల్లో కీలక ఆఫర్ వచ్చినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఐపీఎల్ మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ ఆయనను సీఈవో, మెంటర్, భాగస్వామిగా నియమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
నేషనల్ మీడియా కథనం ప్రకారం, రాజస్థాన్ యాజమాన్యంలో మార్పులు జరగనున్న నేపథ్యంలో గంభీర్కు 2 నుంచి 3 శాతం వాటా కూడా ఇవ్వాలని ఒక వర్గం ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుతం గంభీర్కు బీసీసీఐతో 2027 వరకు ఒప్పందం ఉంది. దాంతో గంభీర్ ఈ ఆఫర్ను దాదాపు తిరస్కరించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
గంభీర్కు ఐపీఎల్లో మంచి అనుభవం ఉంది. గతంలో కోల్కతా నైట్ రైడర్స్కు మూడు టైటిళ్లు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే లక్నో సూపర్ జెయింట్స్కు మెంటర్గా పనిచేసి ప్లేఆఫ్స్కు తీసుకెళ్లాడు. అయితే ప్రస్తుతం ఆయన టీమిండియా బాధ్యతల్లో ఉండటంతో ఈ ఆఫర్ను స్వీకరించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. లోధా కమిటీ సిఫార్సుల ఆధారంగా అమలులో ఉన్న వన్ మ్యాన్ – వన్ పోస్ట్ నిబంధన ప్రకారం, ఒకేసారి జాతీయ జట్టు పదవితో పాటు ఐపీఎల్ ఫ్రాంచైజీలో పనిచేయడం నిషేధం.
ఈ నిబంధనల కారణంగా గంభీర్ రాజస్థాన్ ఆఫర్ను అంగీకరించాలంటే, భారత జట్టు కోచ్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అయితే గంభీర్ లక్ష్యం ప్రస్తుతం ఐసీసీ వన్డే వరల్డ్కప్ 2027 వరకు జట్టును నడిపించడమేనని తెలుస్తోంది. ప్రస్తుతం గంభీర్ టీ20 ప్రపంచకప్లో భారత్ను ఛాంపియన్గా నిలబెట్టాలని చూస్తున్నాడు. జట్టు ఇప్పటికే సూపర్-8కు అర్హత సాధించింది.
ఇక రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం విషయానికి వస్తే, ప్రధానంగా బ్రిటన్కు చెందిన వ్యాపారవేత్త మనోజ్కు చెందిన ఎమర్జింగ్ మీడియా వద్ద మెజారిటీ వాటా ఉంది. అలాగే రెడ్ బర్డ్ క్యాపిటల్ పేరెంట్స్ కూడా భాగస్వాములుగా ఉన్నారు. మొత్తానికి, గంభీర్కు వచ్చిన ఈ ఆఫర్ ఐపీఎల్ వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే టీమిండియా భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.