పంది కడుపున ఏనుగు పిల్ల.. అసలు నిజం ఇదీ!
- Author : Vamsi Chowdary Korata
Date : 20-04-2026 - 11:11 IST
Published By : Hashtagu Telugu Desk
నాగర్కర్నూల్ జిల్లాలో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ పంది, ఏనుగును పోలిన పిల్లకు జన్మనివ్వడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అచ్చం ఏనుగులా తొండం, పెద్ద చెవులతో జన్మించిన ఈ వింత జీవిని చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఈ ఘటన పెద్దకొత్తపల్లి మండలం కార్పాముల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జననానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే… కార్పాముల గ్రామానికి చెందిన కురాకుల వెంకటయ్య పందులను పెంచుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన పెంచుతున్న ఓ పంది ఇటీవల మొదటి ఈతలో ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిని పరిశీలించిన వెంకటయ్యకు ఓ విచిత్రమైన దృశ్యం కంటపడింది. ఆ ఏడు పిల్లల్లో ఒకటి మిగతావాటికి భిన్నంగా ఏనుగు ఆకారంలో ఉండటంతో ఆయన నివ్వెరపోయాడు. ఆ పందిపిల్లకు ముఖభాగంలో తొండం, తలకు ఇరువైపులా పెద్ద చెవులు ఉన్నాయి.
ఈ వింత విషయం ఆ నోటా ఈ నోటా చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. దీంతో ఆ ఏనుగు రూపంలోని పందిపిల్లను చూసేందుకు ప్రజలు వెంకటయ్య ఇంటికి పెద్దఎత్తున తరలివచ్చారు. కొందరు దీనిని ప్రకృతి విచిత్రంగా అభివర్ణిస్తుంటే, మరికొందరు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో చెప్పినట్లు కలియుగంలో ఇలాంటి వింతలు సహజమేనని చర్చించుకుంటున్నారు.
అయితే దురదృష్టవశాత్తూ, ఆ వింత పందిపిల్లతో పాటు మరో పిల్ల పుట్టిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయాయి. ప్రస్తుతం మిగిలిన ఐదు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని యజమాని వెంకటయ్య తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన పశువైద్య నిపుణులు, ఇది దైవ మహత్యమో, వింత శక్తో కాదని స్పష్టం చేశారు. గర్భంలో పిండం ఎదుగుదల సరిగా లేనప్పుడు లేదా జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి శారీరక మార్పులు సంభవిస్తాయని వివరించారు. దీనిని వైద్య పరిభాషలో ‘కంజెనిటల్ అబ్నార్మాలిటీ’ (పుట్టుకతో వచ్చే వైకల్యం) అంటారని, ఇలాంటి వింత ఆకారాలతో పుట్టిన జీవులు ఎక్కువ కాలం బతకడం అరుదని వారు పేర్కొన్నారు.