Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!
- Author : Vamsi Chowdary Korata
Date : 18-04-2026 - 2:37 IST
Published By : Hashtagu Telugu Desk
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. టీ20 అంతర్జాతీయ ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఈ క్రమంలో భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఆమె అధిగమించింది. దక్షిణాఫ్రికాతో శుక్రవారం డర్బన్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో మంధాన ఈ అరుదైన మైలురాయిని అందుకుంది.
A 𝗺𝗲𝗴𝗮 𝗺𝗶𝗹𝗲𝘀𝘁𝗼𝗻𝗲 🔓#TeamIndia vice-captain Smriti Mandhana now has the most runs by any Indian batter in T20Is 🫡
Take a bow! 🙇♀️
Updates ▶️ https://t.co/gQymmRhJci#SAvIND | @mandhana_smriti pic.twitter.com/pNjgxtkYyw
— BCCI Women (@BCCIWomen) April 17, 2026
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్మృతి మంధాన, రోహిత్ శర్మ ఇద్దరూ 4,231 పరుగులతో సమంగా ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్ సునే లూస్ వేసిన బంతికి సింగిల్ తీయడం ద్వారా మంధాన, రోహిత్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్లో ఒక సిక్సర్తో కలిపి 13 పరుగులు చేసిన ఆమె, ఆ తర్వాత అయాబొంగా ఖాకా బౌలింగ్లో ఔటైంది.
తాజా రికార్డుతో స్మృతి మంధాన 161 టీ20 మ్యాచ్ల్లో 30.53 సగటుతో 4,244 పరుగులు పూర్తి చేసింది. ఆమె కెరీర్లో ఒక సెంచరీ, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు రోహిత్ శర్మ 159 మ్యాచ్ల్లో 5 సెంచరీలు, 32 అర్ధశతకాలతో 4,231 పరుగులు చేశాడు.
2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మంధాన రికార్డును తిరిగి అధిగమించే అవకాశం అతనికి లేదు. ఫలితంగా భారత టీ20 క్రికెట్లో పరుగుల రాణిగా స్మృతి మంధాన స్థానం పదిలంగా నిలవనుంది.