Nara Bhuvaneswari: అన్న క్యాంటీన్లో పేదలతో కలిసి చంద్రబాబు,భువనేశ్వరి అల్పాహారం
- Author : Vamsi Chowdary Korata
Date : 20-04-2026 - 11:22 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.76 లక్షలను విరాళంగా ఇచ్చారు. ఉదయాన్నే చంద్రబాబుతో కలిసి అన్నా క్యాంటీన్కు వెళ్లిన ఆమె.. అక్కడికి వచ్చిన వారికి అల్పాహారం వడ్డించడంతోపాటు.. వారితో కలిసి స్వయంగా ఆహారం తీసుకున్నారు. తద్వారా పుట్టిన రోజులు, పెళ్లి రోజు వంటి ప్రత్యేక రోజుల్లో అందరూ అన్నదానానికి తమకు తోచిన మొత్తం విరాళం ఇవ్వాలనే సందేశాన్ని ఆమె ఇచ్చారు.
76వ పుట్టినరోజు… 76 లక్షల విరాళం..
జన్మదినాన్ని పురస్కరించుకుని పటమట అన్న క్యాంటీన్కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు. పేదలు, కార్మికులు, ప్రజల మధ్య తన జన్మదినాన్ని జరుపుకున్న సీఎం.
ముఖ్యమంత్రి చంద్రబాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న… pic.twitter.com/1K3c6Zv8RP
— Telugu Desam Party (@JaiTDP) April 20, 2026
నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత జగన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా దేశవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక టీడీపీ కార్యకర్తలైతే.. తమ అభిమాన నేత పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. చంద్రబాబు నాయుడి జన్మదినం సందర్భంగా.. ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నా క్యాంటీన్లకు రూ.76 లక్షలు విరాళంగా ఇచ్చారు. చంద్రబాబు 76వ పుట్టిన రోజుకు గుర్తుగా ఆమె ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు మనవడు, లోకేశ్-బ్రాహ్మణి దంపతుల ఏకైక కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా నారా ఫ్యామిలీ తిరుమలలో అన్నదానం కోసం ఏటా రూ.44 లక్షలు విరాళంగా ఇస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఒక రోజు ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించడానికి ఈ మొత్తం సరిపోతుంది. అందుకే నారా కుటుంబ సభ్యులు దేవాన్ష్ బర్త్ డే సందర్భంగా ఏటా ఈ మొత్తాన్ని టీటీడీకి విరాళం ఇస్తుంటారు. అంతేకాదు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తప్పకుండా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడాన్ని ఈ కుటుంబం ఆనవాయితీగా పెట్టుకుంది.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లకు భువనేశ్వరి విరాళం ఇవ్వడం ద్వారా.. తెలుగునాట కొత్త సంప్రదాయానికి ఆమె తెర తీశారు. ఇప్పటి వరకూ నేతల పుట్టిన రోజు సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు మాత్రమే అన్నదానం, రక్తదానం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు సైతం విరాళం ఇచ్చే కొత్త ఒరవడికి భువనేశ్వరి శ్రీకారం చుట్టారు.
తెలుగు రాష్ట్రాల్లో ఓ రాజకీయ నాయకుడి పుట్టిన రోజు సందర్భంగా సదరు నేత కుటుంబ సభ్యులు పెద్ద మొత్తంలో విరాళం ఇవ్వడం, అది కూడా పేదల ఆకలి తీర్చడం కోసం కావడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. అలాగనీ మిగతా నాయకుల కుటుంబ సభ్యులు ఏమీ ఇవ్వడం లేదని చెప్పలేం. బయటకు చెప్పుకోకుండా.. ఎంతో మందికి వారు సాయం చేస్తుండొచ్చు. కానీ భువనేశ్వరి బాహాటంగా విరాళం ప్రకటించడం, చంద్రబాబుతో కలిసి స్వయంగా అన్నా క్యాంటీన్లో అల్పాహారం వడ్డించి, తాము కూడా వారితో కలిసి తినడం ద్వారా అన్నదానం విషయమై అందరూ ఆలోచించేలా చేయగలిగారు.
అందుకే చంద్రబాబు నాయుడు సైతం అన్నదానం విషయంలో తన భార్య భువనేశ్వరిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు తమ శక్తి మేర అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఇది ఒక ప్రజా ఉద్యమంలా మారాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఏ వ్యక్తీ ఆకలితో బాధపడే పరిస్థితి రావొద్దన్నారు. భువనేశ్వరి చొరవ, చంద్రబాబు పిలుపుతో ఏపీలోని నేతలు తమ ఆత్మీయుల పుట్టిన రోజు సందర్భంగా అన్నదానానికి ముందుకొచ్చే వీలుంది.