Congress : ప్రధాని ఎప్పుడూ పాత ప్రసంగాలే : మల్లికార్జున ఖర్గే
Congress : జీడీపీలో గృహ రుణం ఎన్నడూ లేని విధంగా పెరిగింది. కొవిడ్ సమయం నుంచి ప్రజలకు ఆదాయం కంటే ఖర్చు రెట్టింపైంది'' అని ఖర్గే 'ఎక్స్'లో పేర్కొన్నారు. '
- Author : Latha Suma
Date : 06-10-2024 - 5:57 IST
Published By : Hashtagu Telugu Desk
Mallikarjun Kharge : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని ఎప్పుడూ పాత ప్రసంగాలే చేస్తున్నారని.. మళ్లీ మళ్లీ వాటినే పునరావృతం చేసినా దేశ ఆర్థిక వ్యవస్థలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చలేరన్నారు. మేకిన్ ఇండియా విఫలమైందన్న ఖర్గే.. ప్రజలపై గృహ రుణాల భారం, ధరల పెరుగుదల, తయారీ రంగంలోని సమస్యలను లేవనెత్తారు. ”మోడీ ఆర్థిక నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు శాపంగా మారాయి. మోడీజీ.. మీరు పాత ప్రసంగాలనే పునరావృతం చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చలేరు. 2013-14 నుంచి నేటి వరకు గృహ సంబంధిత ఖర్చులు 241 శాతం పెరిగాయి.
Read Also: ROR Act 2024 : త్వరలోనే ROR చట్టాన్ని తీసుకురాబోతున్నాం: మంత్రి పొంగులేటి
జీడీపీలో గృహ రుణం ఎన్నడూ లేని విధంగా పెరిగింది. కొవిడ్ సమయం నుంచి ప్రజలకు ఆదాయం కంటే ఖర్చు రెట్టింపైంది” అని ఖర్గే ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ”గతేడాదితో పోలిస్తే.. ప్రస్తుతం నిత్యావసరాల ధరలు పెరిగాయి. ధరల పెరుగుదల బీజేపీ తీసుకున్న నిర్ణయం. అసంఘటిత రంగాన్ని నాశనం చేయడంతోనే ఈ పరిస్థితి దాపురించింది. యూపీఏ హయాంలో పెరిగిన భారత్ ఎగుమతుల లాభాలను మీ విధానాలతో విస్మరించడం వల్లే 10ఏళ్లలో మేకిన్ ఇండియా ఘోరంగా విఫలమైంది” అంటూ మండిపడ్డారు.
మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ .. బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. ”గోవాలో బీజేపీ ఉద్దేశపూర్వకంగా మతపరమైన ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. అక్కడ సామరస్యం దెబ్బతింటోంది. దీనికి కారణం కాషాయ పార్టీనే. గోవాలో బీజేపీ వ్యూహమేంటో స్పష్టమవుతోంది. పర్యావరణ నిబంధలను ఉల్లంఘిస్తోంది. అక్కడి ప్రాంతాలను దోచుకుంటోంది. ప్రజలను విభజించేందుకు ప్రయత్నిస్తోంది. ఇది గోవా సామాజిక వారసత్వంపై దాడి చేయడమే అవుతుంది” అన్నారు.