BJP Ridings: ప్రాంతీయ పార్టీలపై బీజేపీ సవారీ! కేసీఆర్ జాతీయ కుప్పిగంతులు
భారత స్వాతంత్ర్యా (independence) నంతరం ఎక్కువ కాలం అధి కారంలో
- By CS Rao Published Date - 06:00 PM, Sun - 12 February 23
భారత స్వాతంత్ర్యా నంతరం ఎక్కువ కాలం అధి కారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం గావున ముందు వేలు కాంగ్రెస్ వైపు చూపించ వల్సి వస్తుంది. ఇందిర కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలను తరచుగా రద్దు చేసి గవర్నర్ పాలన తీసుకు వచ్చేది. స్థానిక ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా సి.ఎం ఎన్నిక సీల్డ్ కవర్ ద్వారా అందేది. దానితో ప్రాంతీయ భావనలు పెరిగి , నిధులు పంపకాల్లో లోటు పాట్లు వల్ల అసమ్మతి రాజుకుని నిదానంగా ప్రాంతీయ పార్టీల పుట్టుకకు కారణమైనది. దక్షిణాది రాష్ట్రా లయితే నిరాధరణకు గురై అన్నిచోట్లా ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. విద్య , వైద్యం , జనాభా నియంత్రణ, సకాలంలో టాక్సులు చెల్లిస్తూ అన్ని రంగాల్లో దక్షిణాది రాష్ట్రాలు ముందు ఉంటే , ఇంకా ఎక్కువ నిధులు ఇవ్వవలసింది పోయి , కోతలు విధిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రాంతీయ పార్టీలు 50 % పైగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాయని చెప్పక తప్పదు. అనేక పధకాలు విజయవంతంగా అమలు చేసాయి. వాటిని జాతీయ పార్టీలు కూడా అమలు చేయక తప్పడం లేదు. కిలో రెండు రూపాయల పధకం , పేద వారికి ఇళ్ళు , మహిళలకు ఆస్థిలో సమాన హక్కు, మహిళా రిజర్వేషన్లు , బి.సి రిజర్వేషన్లు , రైతు భరోసా , ఆరోగ్య శ్రీ , ఫీజ్ రీయంబర్స్ మెంట్ లాంటివి రాష్ట్రాలు అమలు చేసాకే కేంద్రం అమలు చేస్తోంది. వీటిని విజయవంతంగా అమలు చేస్తున్న ప్రాంతీయ పార్టీలు తమ పార్టీని జాతీయ పార్టీగా మార్చాలని ఉబలాట పడుతున్నాయి.
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోని తెలుగు రాష్ట్రాల్లో ఈ భావన ఎక్కువుగా ఉంది. అవసరం అనుకుంటే కేంద్ర పార్టీలే రాష్ట్రాలను విడగొడతాయి. అలా అవకాశం ఇవ్వగా ఏర్పడిందే తెలంగాణా రాష్ట్రం. ఇంత జరిగినా తెలుగు రాష్ట్రాలలోని టి.డి.పి , టి.ఆర్.ఎస్ పార్టీలు జాతీయ పార్టీలుగా మారేందుకు ఉబలాట పడు తున్నాయి. వీటికి ఇది సాద్యం కానే కాదు. భారతదేశం 50 చిన్న రాష్ట్రాలుగా ఉండాలనేది బి.జె.పి రాజకీయ సిద్ధాంతం. అందుకోసం ఎక్కడ విభజన వాదం వచ్చినా సై అంటుంది. అందుకే తెలంగాణా వాదానికి మద్దతు ఇచ్చింది. పెద్ద రాష్ట్రాలుగా ఉంటే బెదిరిస్తాయని , అదే చిన్న రాష్ట్రాలుగా ఉంటే ఎదురు తిరిగే అవకాశం తక్కువ ఉంటుందనేది బి.జె.పి భావన. తమిళనాడు, కర్ణాటక విడగొట్టే ప్రయత్నాలను బి.జె.పి చేసింది గానీ కుదరడం లేదు. కర్ణాటకలో బిజె.పి అధికారం లోకి వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి విభజన సిద్ధాంతం పక్కన బెట్టింది. తమిళనాడు మొదటి నుండీ ప్రాంతీయ భావం , భాషాభిమానం ఎక్కువ కాబట్టి అక్కడ అవకాశం కుదరడం లేదు. కేరళలో విధ్యాధికులు ఎక్కువ కాబట్టి , రాష్ట్రం కూడా చిన్నది కావున , కమ్యూనిజ భావజాలం ఎక్కువ ఉండడంతో కాలు మోపడానికి కుదరడం లేదు. ప్రస్తుతం దేశంలో కేంద్ర పార్టీలు 8 ఉన్నాయి. 54 ప్రాంతీయ పార్టీలు , గుర్తింపు లేని పార్టీలు 2795 ఉన్నాయి.
కేంద్ర పార్టీలు కాంగ్రెస్, బి.జె.పి , సి.పి.ఐ , సి.పి.ఎం , తృణముల్ కాంగ్రెస్ ( మమతా బెనర్జీ ) , బహుజన్ సమాజ్ పార్టీ ( మాయావతి ) , నేషనలిస్ట్ కాంగ్రెస్ ( శరత్ పవార్ ) , నేషనల్ పీపుల్స్ పార్టీ ( సంగ్మా ) లు. కేంద్ర పార్టీగా గుర్తింపు రావాలంటే పార్లమెంట్ లేక అసెంబ్లీ స్థానాల్లో 4 అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో పోటీ చెయ్యాలి. ఎన్నికల్లో పోటీ చేసి పోలైన ఓట్లలో 6 % రావాలి. ఏదైనా ఒక రాష్ట్రం నుండి లేదా రాష్ట్రాల నుండి 4 ఎం.పి అభ్యర్ధులు ఎన్నిక అవ్వాలి . కనీసం 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. లోక్ సభలో అయితే మొత్తం సీట్లలో రెండు శాతం సీట్లను గెల్చుకుని , వాటిని కనీసం మూడు రాష్ట్రాల్లో గెలిచి ఉండాలి. అదే ప్రాంతీయ పార్టీ హోదా రావాలంటే 2013 కేంద్ర ఎన్నికల సంఘం తెల్పిన ప్రకారం రాష్ట్ర ఎన్నికల్లో పోలైన ఓట్లలో 6 % ఓట్లు రావాలి. రెండు అసెంబ్లీ స్థానాలు గెలుపొందాలి. అలాగే లోక్ సభ ఎన్నికల్లో అయితే 6 % ఓట్లు సాధించి , ప్రతి 25 లోక్ సభ స్థానాలకు ఒక లోక్ సభ స్థానం గెలుపొందాలి. శాసన సభకు అయితే ఓట్ల శాతం తీసుకోకపోతే 3 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందాలి , పోనీ ఇవేమీ గెలవక పోయినా మొత్తం పోలైన ఓట్లలో 8 % కు పైగా ఓట్లు సాధిస్తే పార్టీ హోదా దక్కుతుంది . అందుకే గత ఎన్నికల్లో జనసేనకు ఇవి దక్కలేదు కాబట్టే పార్టీ హోదా రాలేదు. జాతీయ, రాష్ట్ర పార్టీలైన ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు లేని పార్టీలను రిజిస్టర్డ్ పార్టీలు అంటారు.
ఈ పార్టీలు శాసనసభ ఎన్నికల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చెయ్యాలి. 50 కంటే తక్కువ స్థానాలు ఉంటే 5 స్థానాల్లో పోటీ చెయ్యాలి. 20 కంటే తక్కువ లోక్ సభ స్థానాలు ఉంటే 2 స్థానాల్లో పోటీ చెయ్యాలి. ఇప్పుడు కె.సి.ఆర్ తన పార్టీ బి.ఆర్.ఎస్ ను తెలంగాణా చూట్టూ ఉన్న మహారాష్ట్ర , కర్నాటక , ఎ.పి ల్లో తన పార్టీ అభ్యర్ధులను నిలపాలని చూస్తున్నారు. అందులో తెలంగాణా కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో తెలుగువారు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఆరు శాతం ఓట్లు సాధించవచ్చు అనేది ఆయన ఎన్నికల వ్యూహం. తెలంగాణా తప్పించి మిగతా మూడు రాష్ట్రాల్లో మొత్తంగా మూడు పార్లమెంట్ స్థానాలు గెలిస్తే జాతీయ హోదా వస్తుంది. ఇది ఫలవంత మయితే కేంద్రంలోకి అడుగుపెట్టవచ్చు. ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా మారాలంటే వ్యూహం , ఎత్తుగడ చాలా ముఖ్యం. అది క్రేజీవాల్ నుండీ నేర్చుకోవాలి . 10 ఏళ్ళ క్రితం ప్రారంభమైన ఆం ఆద్మీ పార్టీ ఇప్పుడు ఆరు రాష్ట్రాల్లో పోటీ చేయగలిగింది. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. గోవాలో రెండు స్థానాలు , గుజరాత్ లో 12% ఓట్లతో 6 స్థానాలు గెల్చుకుంది. నాల్గు చోట్ల విజయాల నమోదు జరిగింది కావున , భారత ఎన్నికల కమిషన్ కేంద్రపార్టీ గుర్తింపు ప్రకటించడమే మిగిలి ఉంది. ఇ.వి.ఎం మిషన్లలో ఆం ఆద్మీ పార్టీ పేరు వరుస క్రమంలో ప్రధమ స్థానంలో ఉండి , చీపురు గుర్తు చోటు దక్కించు కుంటుంది. 40 ఏళ్ల క్రితం ప్రారంభమైన టి.డి.పి , 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన టి.ఆర్.ఎస్ నేడు జాతీయ పార్టీలుగా ప్రకటించుకుంటే సరిపోతుందా ? మమతా బెనర్జీ , మాయావతిని , ఎన్.సి.పి కేంద్ర పార్టీల కంటే క్రెజీవాల్ పార్టీ కొత్తది. అది ఎలా విస్తరిస్తోందో ముందు అవగాహన చేసుకోవాలి. ఏ మాత్రం ప్రచార పటాటోపం లేకుండా సైలెంట్ గా క్రేజీవాల్ తన పని తాను చేసుకు పోతున్నాడు. కె.సి.ఆర్ మాత్రం అట్టహాసంగా కోట్లాది రూపాయలు కుమ్మరిస్తూ , కార్యాలయాలు ప్రారంభిస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇదంతా అవినీతి డబ్బే అని బి.జె.పి ప్రచారం చేస్తోంది . అవినీతి రహిత పాలన అందిస్తున్న క్రేజీవాల్ కు లిక్కర్ స్కాంలో అవినీతి మరక అంటించేందుకు సిద్ధ మైనారు టి.ఆర్.ఎస్, వై.సి.పి నేతలు. దీన్ని చీపురు పెట్టి ఊడ్చేయ గలగాలి క్రేజీవాల్ . మౌనంగా ఎదగమని, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనేది క్రేజీవాల్ సూత్రం. మరి ఏమి చేస్తాడో చూడాలి. టి.డి.పి కి కొంత తెలంగాణాలో పట్టు ఉంది . కె.సి.ఆర్ కు ఎ.పి లో ఏ విధమైన పట్టు లేదు , పైగా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆంధ్రులను అడ్డగోలుగా తిట్టిపోసిన నేల మీదనే ఎలా పోటీ చేస్తాడు , దానికి ఎంత గట్స్ కావాలి . ఎ.పి నుండి రెండు రాజ్యసభ సీట్లను తెలంగాణా వారైన ఆర్ . క్రిష్ణయ్య , నిరంజన్ రెడ్డి లకు కేటాయించాడు వై.సి.పి నేత ఖమ్మం బహిరంగ సభకు ఎ.పి నుండి ఆర్.టి.సి బస్సులను పంపించారు. టి.డి.పి ని , బి.ఆర్.ఎస్ లను ఎన్నికల సంఘం రిజిస్టర్డ్ పార్టీలుగానే గుర్తిస్తుంది గాని కేంద్ర పార్టీలుగా కాదనేది గమనించాలి. జాతీయ పార్టీలకు ఎన్నికల సమయం లో దూరదర్శన్ , ఆల్ ఇండియా రేడియోలో ప్రత్యక్ష ప్రసారాలకు కొంత సమయం లభిస్తుంది , పార్టీ అధ్యక్షునికి ఢిల్లీ లో ప్రభుత్వ బంగళా మరియు పార్టీ కార్యాలయ స్థాపనకు తక్కువ ధరకు ఢిల్లీ లో స్థలం కేటాయింపు ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు తమ ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర నిధులు రాబట్టుకోవాలి అంటే కేంద్ర పార్టీ అండ తప్పనిసరి. ఒక్కోసారి హంగ్ ఏర్పడినప్పుడు ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుంది.
అలా రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ అవినీతి మరక అంటించుకుంది. 1977, 1989 , 1996 ల్లో ప్రతిపక్షాల కూటమిగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగినా అవి ప్రజలను సంతృప్త పర్చలేక విఫలం చెందాయి. దానితో ప్రతిపక్షాలను చీదరించుకున్న ప్రజలు సుస్థిర ప్రభుత్వం కోసం వాజ్ పాయ్ నేతృత్వం లోని బి.జె.పి వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు అదే బి.జె.పి. మోదీ నాయకత్వంలో అందరి నెత్తిన ఎక్కి తైతక్క లాడుతోంది. థర్డ్ ఫ్రంట్ కు అవకాశం ఉన్నా కొందరికి బి.జె.పి. తో ఉన్న లోపాయికారీ అవగాహన వల్ల విడివిడి గానే పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ , కమ్యూనిస్ట్ లు ఐక్య ఉద్యమాలు నిర్మించలేక చతి కిల పడడంతో ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలకే పరిమితమై పోయాయి. కాంగ్రెస్ ఓట్లను ఆం ఆద్మీ , తృణముల్ కాంగ్రెస్ , వై.సి.పి. , కొన్ని చోట్ల బి.జె.పి. లు లాక్కుని అవి బలపడ్డాయి.
Also Read: ఫోన్లో మాట్లాడుతుంటే అమ్మాయిని! అనుమానంతో పై నుంచి కిందికి తోసేసిన తండ్రి
Tags
Related News
KCR : తెలంగాణ గొంతుకపై నిషేధమా..? ఇదెక్కడి న్యాయం..?
48 గంటలపాటు ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయకూడదని ఆంక్షలు విధించింది