చంద్రబాబు కీలక నిర్ణయాలు.. ఉగాది సందర్భంగా 2.5 లక్షల మందికి సీఎం కానుక!
- Author : Vamsi Chowdary Korata
Date : 11-03-2026 - 1:52 IST
Published By : Hashtagu Telugu Desk
Ap Cm Chandrababu Naidu ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశంలో చంద్రబాబు కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.. అలాగే కీలక ప్రకటనలు చేశారు. ఉగాదికి 2.50 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. అంతేకాదు రాబోయే రోజుల్లో కరెంట్ బిల్లులు కూాడా తగ్గిస్తామని ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇస్తామన్నారు సీఎం.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు రెండు శుభవార్తలు చెప్పారు. అమరావతిలో నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో కీలక ప్రకటన చేశారు. కలెక్టర్లు ఇకపై క్షేత్రస్థాయిలో పర్యటించాలని.. సంక్షేమం, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని దిశా నిర్దేశం చేశారు. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ సహా పథకాలను అమలు చేస్తూ.. పాలనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. 2047 స్వర్ణాంధ్ర విజన్ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పేదలకు చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఉగాది కానుకగారాష్ట్రంలో మొత్తం 2.50 లక్షల లబ్ధిదారులకు సామూహిక గృహప్రవేశాలు చేయిస్తామని ప్రకటించారు. మూడేళ్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం అందించాలని.. జూన్లో మరికొందరికి ఇళ్లు అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ట్రూఅప్ పేరిట ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని.. కూటమి ప్రభుత్వం మాత్రం ట్రూడౌన్ చేసిందన్నారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని చెప్పారు సీఎం. రాష్ట్రంలో 6 లక్షల సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఉగాదికి దివ్యాంగులకు ఉచిత బస్సు ఇంద్రధనస్సు పేరుతో సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఈ నెల 13న అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామన్నారు చంద్రబాబు. కేంద్రం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కలిపి ఇస్తామన్నారు. వచ్చే ఏడాది నాటికి రాష్ట్రంలో భూ వివాదాలు ఉండకూడదన్నారు చంద్రబాబు. రెవెన్యూ అధికారులు ఆ దిశగా పనిచేయాలని సూచించారు.
రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి. ఏడాదిలో లక్షా 15వేలమంది పారిశ్రామిక వేత్తల్ని తయారు చేశామని.. ఈ నెల 8న నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమ వేదికపై లక్షమంది పారిశ్రామివేత్తల్ని తయారు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతి వెయ్యిమందికి ఒక స్టార్టప్ రావాలన్నాలరు. రాష్ట్రంలో సాగునీటికి ఇబ్బందులు లేవని.. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 614 టీఎంసీల నీళ్లు రిజర్వాయర్లలో ఉన్నట్లు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ జులై నాటికి పూర్తి చేసి నీటిని అందిస్తామని ప్రకటించారు. 2027లో పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాజెక్టులు ప్రాధాన్యం క్రమంలో పూర్తి చేస్తామని ప్రకటించారు చంద్రబాబు.
జిల్లా కలెక్టర్లు, సీనియర్ సెక్రటరీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు చంద్రబాబు. జిల్లా కలెక్టర్లు 8 రోజులు, సీనియర్ సెక్రటరీలు 4 రోజుల పాటు ఫీల్డ్ విజిట్లు చేయాలన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో అధికారుల్ని అప్రమత్తం చేయాలన్నారు. కేంద్రం జలవజీవన్ మిషన్ పథకం కాలపరిమితిని పొడిగించిందని.. వచ్చే రెండేళ్లలో జలజీవన్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికి కుళాయి అందించాలని సూచించారు. అలాగే పైప్లైన్ల కోసం రోడ్లు తవ్వి.. దాన్ని అలాగే వదిలేస్తున్నారని.. ఇది సరికాదన్నారు చంద్రబాబు.