Pithapuram వర్మపై టీడీపీ వేటు
- Author : Vamsi Chowdary Korata
Date : 07-05-2026 - 2:31 IST
Published By : Hashtagu Telugu Desk
2024 ఎన్నికల తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో తరచుగా వివాదాలు నెలకొంటుండడంపై టీడీపీ హైకమాండ్ దృష్టిసారించింది.. నియోజకవర్గంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలను తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.
వర్మను తప్పించడంతో పాటు, నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను సమర్థవంతంగా ముందుకు నడిపేందుకు వీలైనంత త్వరగా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి పార్టీ స్థాయిలో ఇప్పటికే కసరత్తు మొదలైంది. కొత్త కమిటీ ద్వారా నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల్లో సమన్వయం సాధించి, పార్టీని మరింత బలోపేతం చేయాలని అధిష్ఠానం భావిస్తోంది. త్వరలోనే ఈ కమిటీ సభ్యులను ప్రకటించనున్నారు.
గత కొంతకాలంగా పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ వర్గానికి, జనసేన క్యాడర్ కు మధ్య తరచుగా వివాదాలు ఏర్పడుతున్నాయి. ఇది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో, కూటమి పొత్తు ధర్మం దెబ్బతినకుండా టీడీపీ అధిష్ఠానం నష్టనివారణ చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది.