AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే
- Author : Vamsi Chowdary Korata
Date : 07-05-2026 - 10:47 IST
Published By : Hashtagu Telugu Desk
తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నూతనంగా ఎన్నికైన 12 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని ఒక రిసార్టుకు తరలించడంతో తీవ్ర గందరగోళం మొదలైంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే)కు ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చే విషయంలో పార్టీలో విభేదాలు తలెత్తాయనే ఊహాగానాలకు ఈ పరిణామం బలం చేకూర్చింది.
అయితే, ఈ వార్తలను అన్నాడీఎంకే నాయకత్వం తీవ్రంగా ఖండించింది. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అంతా సవ్యంగానే ఉందని స్పష్టం చేసింది. టీవీకే తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే అవకాశం ఉందని, వారిని కాపాడుకోవడానికే రిసార్టుకు తరలించామని వివరణ ఇచ్చింది. “టీవీకేకు అన్నాడీఎంకే ఎలాంటి మద్దతు ఇవ్వడం లేదు. పార్టీ చీఫ్ ఈపీఎస్ ఆమోదంతో ఈ విషయం ప్రకటిస్తున్నాను” అని సీనియర్ నేత కేపీ మునుసామి స్పష్టం చేశారు.
ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ పార్టీకి మద్దతుపై పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) తొలుత మౌనంగా ఉండటంతోనే ఈ గందరగోళం తలెత్తిందని ఎన్డీటీవీతో అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. ఆయన మౌనం కారణంగా కొందరు ఎమ్మెల్యేలు విజయ్కు మద్దతు ఇవ్వాలని భావిస్తున్నారనే ప్రచారం జరిగిందని అంగీకరించాయి. అయితే, ఇప్పుడు ఈపీఎస్ తన వైఖరిని స్పష్టం చేశారని, టీవీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పడంతో ఎమ్మెల్యేలంతా ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని ఆ వర్గాలు వివరించాయి.
మ్యాజిక్ ఫిగర్ కోసం విజయ్ వేట
ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్ ఫిగర్కు 10 స్థానాల దూరంలో నిలిచిపోయింది. దీంతో కాంగ్రెస్ (5), వామపక్షాలు (4), వీసీకే (2) పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో విజయ్ ఉన్నారు. అయితే, బీజేపీతో గతంలో పొత్తు పెట్టుకున్న అన్నాడీఎంకే మద్దతు కోరడానికి విజయ్ సిద్ధంగా లేరని, దానివల్ల భవిష్యత్తులో బీజేపీ ప్రభావం తన ప్రభుత్వంపై పడుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల జాబితాను సమర్పిస్తేనే ఆహ్వానిస్తామని విజయ్కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ సూచించినట్లు సమాచారం. దీంతో తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది.