CM Vijay Thalapathy: సీఎం విజయ్ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!
- Author : Vamsi Chowdary Korata
Date : 07-05-2026 - 12:53 IST
Published By : Hashtagu Telugu Desk
టీవీకే అధినేత విజయ్కు గవర్నర్ గుడ్ న్యూస్ చెప్పారు. గురువారం విజయ్ మరోసారి గవర్నర్ను కలవగా.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన అంగీకారం తెలిపారని తెలుస్తోంది. దీంతో సీఎంగా విజయ్ ప్రమాణం చేయడానికి అడ్డంకులు తొలగిపోయాయని భావించవచ్చు. బుధవారమే విజయ్, టీవీకే ప్రతినిధులు గవర్నర్ను కలిశారు. అయితే మ్యాజిక్ ఫిగర్కు టీవీకే కొద్ది దూరంలో నిలవడంతో గవర్నర్ నుంచి సానుకూల స్పందన రాలేదు. గురువారం మరోసారి తమిళనాడు గవర్నర్ను కలిసిన టీవీకే చీఫ్ విజయ్ ఆయన్ను ఒప్పించగలిగారు.
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది. విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారని తెలుస్తోంది. గురువారం ఉదయం మరోసారి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను విజయ్ కలిసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. 112 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయగలరు? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మెజార్టీని ఎలా నిరూపించుకోగలరు అని విజయ్ను గవర్నర్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనికి విజయ్ బదులిస్తూ.. ఇప్పుడే తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల వివరాలను బయటపెట్టలేనని.. అసెంబ్లీలో తప్పకుండా బలం నిరూపించుకుంటానని విజయ్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు తొలగినట్లయ్యింది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీవీకే తమిళనాడు అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకోవాల్సి ఉంటుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు సాధించిన టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారని భావించారంతా. కానీ అలా జరగలేదు. దీంతో బుధవారం సాయంత్రం విజయ్ స్వయంగా గవర్నర్ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. గవర్నర్ నుంచి సానుకూల స్పందన రావడం లాంఛనమేననే భావనతో మే 7న (నేడు) విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడానికి చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. కానీ గవర్నర్ మాత్రం 118 మంది సభ్యుల బలం లేకపోవడంతో సానుకూలంగా స్పందించలేదు. మెజార్టీ నిరూపించుకుంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామన్నట్లుగా లోక్ భవన్ వర్గాలు స్పందించాయి. దీంతో గవర్నర్ తీరు పట్ల
బుధవారం రాత్రికి తమిళనాడులో కొత్త ప్రచారం తెర మీదకు వచ్చింది. డీఎంకే, అన్నాడీఎంకే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయని, చిన్న పార్టీల మద్దతు తీసుకుంటాయని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని అన్నాడీఎంకే ఖండించింది. డీఎంకే తమకు బద్ధ శత్రువు అని ప్రకటించింది. మరోవైపు డీఎంకే సైతం విజయ్ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఈ విషయంలో తాము అడ్డు రాబోమని ప్రకటించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం ఉదయం మరోసారి గవర్నర్ అర్లేకర్ను కలిసిన విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరారు. గవర్నర్ అనుమానాలను నివృత్తి చేసిన విజయ్.. అనుకున్నది సాధించారు. దీంతో నేడే ఆయన తమిళనాడు సీఎంగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. అయితే ముందుగా ఉదయం 11.30 గంటలకు విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని చెప్పారు, కానీ ఆ సమయం దాటిన తర్వాత గవర్నర్ నుంచి సానుకూల స్పందన రావడంతో.. ప్రమాణ స్వీకార సమయం మారనుంది.