శాశ్వత ప్రజా రాజధానిగా అమరావతి!
అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటూ వైసీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- Author : Gopichand
Date : 02-04-2026 - 7:51 IST
Published By : Hashtagu Telugu Desk
Amaravati: ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ప్రజల చిరకాల స్వప్నం, వేలాది మంది రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించింది. గత ఐదేళ్ల పాలనలో అంధకారంలో పడిన అమరావతి భవిష్యత్తుకు ఇప్పుడు శాశ్వత చట్టబద్ధత లభించింది. రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడంతో 2024 జూన్ 2 నుండి అమరావతి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా రూపుదిద్దుకోనుంది.
భారత చరిత్రలోనే అరుదైన ఘట్టం
ఒక రాష్ట్ర రాజధానికి పార్లమెంట్ నేరుగా చట్టబద్ధత కల్పించడం భారత రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయి. ఇకపై పాలకులెవరు వచ్చినా అమరావతి అస్తిత్వాన్ని కదిలించలేరన్న భరోసా ఈ బిల్లుతో లభించింది. దాదాపు 40 పార్టీలు అమరావతి అభివృద్ధికి మద్దతు ప్రకటించడం విశేషం. రాజ్యసభ ఆమోదం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం తర్వాత ఇది పూర్తిస్థాయి చట్టంగా మారనుంది.
Also Read: వాట్సాప్లో మరో సరికొత్త ఫీచర్!
రైతుల త్యాగానికి దక్కిన గౌరవం
తమ స్వార్థం కోసం రాజధానిని మార్చాలని చూసిన కుట్రలను ఎదురించి, 1600 రోజులకు పైగా ఎండనక, వాననక ధర్మపోరాటం చేసిన రైతులకు ఈరోజు దక్కిన విజయం ఒక పట్టాభిషేకం లాంటిది. 33 వేల ఎకరాల భూములిచ్చిన రైతులపై లాఠీఛార్జులు, అక్రమ కేసులు బనాయించినా వెనక్కి తగ్గని వారి నిశ్చయమే నేడు అమరావతిని ప్రపంచ పటంలో నిలబెట్టింది.
సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అభివృద్ధి
కూటమి ప్రభుత్వం అమరావతిని కేవలం ఒక నగరంలా కాకుండా, 26 జిల్లాల అభివృద్ధికి ఆదాయ వనరుగా, యువతకు ఉద్యోగ కల్పవల్లిగా తీర్చిదిద్దుతోంది. రాజధాని నిర్మాణం కోసం తీసుకునే అప్పులకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ వహిస్తుంది. రాజధానిలోని మిగులు భూముల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయంతోనే అప్పులు తీర్చేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రాబోయే 15 ఏళ్లలో ప్రపంచం మెచ్చేలా ప్రణాళికాబద్ధంగా నగరాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
అడ్డంకులు సృష్టించినా ఆగని విజయం
అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటూ వైసీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన వారు, ఇప్పుడు మరో రూపంలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మేధావులు అభిప్రాయపడుతున్నారు.