TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు
- Author : Prasad
Date : 27-05-2026 - 4:03 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ మహానాడు కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన రాజకీయ అంశాలు, పార్టీ పాత్ర, భవిష్యత్ వ్యూహాలపై నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్ పార్టీ చరిత్ర, అభివృద్ధి అంశాలపై మాట్లాడారు. బక్కని నరసింహులు మాట్లాడుతూ .. తెలంగాణలో పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు ద్వారా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు అమలు చేశారని, కార్యకర్తల సంక్షేమమే టీడీపీ ప్రధాన లక్ష్యమని అన్నారు. అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ .. తెలంగాణతో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పార్టీ కీలకంగా పనిచేసిందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి టీడీపీ పాలనలో వేసిన పునాదులు ముఖ్యమైనవని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. తెలంగాణలో మళ్లీ టీడీపీ బలోపేతం కావాలని కార్యకర్తలు ఆశిస్తున్నారని అన్నారు.