Caste Census Report: ప్రభుత్వానికి కులగణన నివేదికను సమర్పించిన కమిటీ!
ఈ సర్వే సైంటిఫిక్ అని నిరూపితమైందని, తెలంగాణ నిర్వహించిన సర్వే చరిత్రాత్మకమని, దేశానికి రోల్ మోడల్గా మారుతుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది.
- By Gopichand Published Date - 07:11 PM, Sat - 19 July 25

Caste Census Report: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, కుల సర్వే (కులగణన)పై అధ్యయనం చేయడానికి నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ తన నివేదికను (Caste Census Report) ప్రభుత్వానికి సమర్పించింది. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలోని నిపుణులు ఈ నివేదికను అందజేశారు.
కీలక సమావేశం.. హాజరైన ప్రముఖులు
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఈ. శ్రీధర్, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ. శరత్, తదితరులు పాల్గొన్నారు.
Also Read: EVERTA: భారత EV మార్కెట్లో సంచలనం సృష్టించనున్న EVERTA.. 2025లోనే ఫాస్ట్ ఛార్జర్ లాంచ్.!
నిపుణుల కమిటీ సభ్యులు & వారి నివేదిక
వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె అయిలయ్య, సభ్యులు ప్రొఫెసర్ శాంతా సిన్హా, ప్రొఫెసర్ హిమాన్షు, డా. సుఖదేవ్ తొరాట్, నిఖిల్ డే, ప్రొఫెసర్ భాంగ్య భూక్య, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, ప్రొఫెసర్ జీన్ డ్రెజ్, ప్రొఫెసర్ థామస్ పికెట్టి, ప్రవీణ్ చక్రవర్తి, సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తమ నివేదికను ఈ సందర్భంగా సమర్పించారు.
ఈ సర్వే సైంటిఫిక్ అని నిరూపితమైందని, తెలంగాణ నిర్వహించిన సర్వే చరిత్రాత్మకమని, దేశానికి రోల్ మోడల్గా మారుతుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను, సూచనలను కేబినెట్లో చర్చించి ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది.
కులగణన వివరాలు
సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది.
మొదటి దశ: 2024 నవంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు 50 రోజుల పాటు రాష్ట్రమంతటా సర్వే జరిగింది.
సర్వే పద్ధతి: రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాకు చెందిన సమాచారం సేకరించేందుకు ప్రతి జిల్లాలో ప్రతి 150 కుటుంబాలను ఒక బ్లాక్గా ఎంచుకుంది. ఒక్కో బ్లాక్కు ఒక ఎన్యుమరేటర్ను, ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమించింది.
సిబ్బంది: రాష్ట్రవ్యాప్తంగా 1,03,889 మంది ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లతో శాస్త్రీయంగా సర్వే చేయించింది.
డేటా ఎంట్రీ: మొదటి విడతలో రాష్ట్రంలో 96.9 శాతం కుటుంబాలను సర్వే చేసి ఆయా కుటుంబాల వివరాలను 36 రోజుల్లో డేటా ఎంట్రీ చేయించింది.
రెండో విడత: మొదటి దశలో హౌస్ లిస్టింగ్ చేసినప్పటికీ.. కొన్ని కారణాలతో వివరాలు నమోదు చేయని కుటుంబాలకు ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రెండో విడతలో వివరాల నమోదుకు అవకాశం కల్పించింది.
నమోదు విధానం: మీ సేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ, ఎంపీడీవో ఆఫీసులు, వెబ్సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేయించింది.
సర్వే ఫలితాలు & వర్గాల వారీగా జనాభా శాతం
ఈ సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో 1,15,71,457 గృహాలు ఉన్నాయి. 1,12,36,849 (97.10%) కుటుంబాల నుంచి 3,55,50,759 మంది ఈ సర్వేలో తమ వివరాలను నమోదు చేసుకున్నారు.
సమగ్ర కుల గణన సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో జనాభా వివరాలు
- ఎస్సీలు: 61,91,294 మంది (17.42%)
- ఎస్టీలు: 37,08,408 మంది (10.43%)
- బీసీలు: 2,00,37,668 మంది (56.36%)
- ఇతర కులాలకు చెందిన వారు: 56,13,389 మంది (15.89%)
- ఈ సర్వే వివరాల నివేదికను ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించింది.
నిపుణుల కమిటీ సూచనలు
సర్వే ఫలితాలను అధ్యయనం చేసి విధాన నిర్ణయాలను రూపొందించేందుకు వీలుగా సర్వే డేటాను విశ్లేషించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో 11 మంది సభ్యులతో స్వతంత్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసింది. సర్వే ఫలితాలను విశ్లేషించి వివరణాత్మక నివేదికను అప్పగించే బాధ్యతను ఈ నిపుణుల కమిటీకి అప్పగించింది.