Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది
- Author : Sudheer
Date : 11-03-2026 - 10:54 IST
Published By : Hashtagu Telugu Desk
రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ కీలక సీఈసీ సమావేశంలో రాహుల్ గాంధీ, కే.సీ. వేణుగోపాల్, సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోని వంటి హేమాహేమీలు పాల్గొన్నారు. గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని, ముఖ్యంగా యువతకు మరియు కొత్త ముఖాలకు ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేరళలో అధికారాన్ని చేజిక్కించుకోవడం కాంగ్రెస్కు అత్యవసరం కావడంతో, ప్రతి నియోజకవర్గ సమీకరణాలను అగ్రనేతలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Kerala Cng Metting
ఈ సమావేశంలో తెలంగాణకు చెందిన కీలక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొనడం విశేషం. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సభ్యుడిగా లేదా కీలక బాధ్యతల్లో భాగంగా ఆయన ఈ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తన అనుభవాన్ని పంచుకున్నారు. కేరళ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో కలిసి నియోజకవర్గాల వారీగా ఉన్న క్షేత్రస్థాయి నివేదికలను అగ్రనేతలకు వివరించారు. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను చిత్తు చేస్తూ, కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ భేటీ అనంతరం మొదటి విడత అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.