Kunamneni On BJP: తలకిందులుగా తపస్సు చేసినా బీజేపీ గెలవదు: కూనంనేని
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ తమ ఉనికిని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఈ మేరకు కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఖమ్మంలో పర్యటించనున్నారు
- By Praveen Aluthuru Published Date - 02:42 PM, Tue - 13 June 23

Kunamneni On BJP: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ తమ ఉనికిని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఈ మేరకు కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఖమ్మంలో పర్యటించనున్నారు. జూన్ 15వ తేదీన అమిత్ షా ఖమ్మం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ వ్యవహారంపై ఆయన మండిపడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి నో ఛాన్స్ అంటూ జోస్యం చెప్పారు.
ఈ రోజు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ బీజేపీని ఎండగట్టారు. బీజేపీ తలకిందులుగా తపస్సు చేసినా ఆ పార్టీ ఖమ్మంలో ప్రభావం చూపలేదని అభిప్రాయపడ్డారు. ఇక తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం ఇంపాసిబుల్ అని చెప్పారు. రాష్ట్రంలోని పార్టీలు ఖమ్మంపై ఫోకస్ చేస్తున్నాయన్న కూనంనేని తెలంగాణకు బీజేపీ చేసింది ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా విభజన హామీలను బీజేపీ భేఖాతర్ చేసిందని మండిపడ్డారు. అమిత్ షా ఖమ్మం వచ్చి ఏం చెప్పదల్చుకున్నారని కూనంనేని ప్రశ్నించారు.
తెలంగాణలో ఖమ్మం, నల్గొండ జిల్లాలు కమ్యూనిస్టుల బలమని చెప్పారు కూనంనేని. ఇదే సమయంలో కూనంనేని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సింగరేణిపై శ్వేతపత్రం విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వాలని అన్నారు. పోడు భూముల సమస్యలు తీర్చాలని పేర్కొన్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ పూర్తి చేయాలి. ధరణిలో అనేక సమస్యలు ఉన్నాయి. ధరణిలో సమస్యలను పరిష్కరించాలని సూచించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.
Read More: MLC Kavitha: ఆడబిడ్డల అభివృద్ధికి కేసీఆర్ పెద్దపీట: ఎమ్మెల్సీ కవిత