భారత్ చేతిలో ఓటమి కారణం ఇదే.. కోచ్ సంచలన వ్యాఖ్యలు!
- Author : Vamsi Chowdary Korata
Date : 16-02-2026 - 2:23 IST
Published By : Hashtagu Telugu Desk
Ind Vs Pak భారత్తో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో 61 పరుగుల తేడాతో ఓడిన తర్వాత పాకిస్తాన్ జట్టు డ్రెస్సింగ్ రూమ్లో తీవ్ర నిరాశ నెలకొందని హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ చెప్పాడు. ఆటగాళ్లు భావోద్వేగంగా కుంగిపోయారని తెలిపాడు. ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్, బుమ్రా దెబ్బతో పాక్ పతనం అయింది. అయినా టోర్నీలో ఇంకా ఆశ ఉందని హెస్సెన్ నమ్మకం వ్యక్తం చేశాడు. పాకిస్తాన్ తన చివరి మ్యాచ్ను నమీబియాతో ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే సూపర్ 8కి అవకాశం దక్కుతుంది.
భారత్తో జరిగిన కీలక మ్యాచ్లో ఘోర ఓటమి తర్వాత పాకిస్తాన్ జట్టు డ్రెస్సింగ్ రూమ్లో తీవ్ర నిరాశ వాతావరణం నెలకొందని హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ చెప్పాడు. కొలంబోలోని ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్కప్ 2026 గ్రూప్ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్తాన్ 61 పరుగుల తేడాతో ఓడిపోయింది.
మ్యాచ్ అనంతరం హెస్సన్ మాట్లాడుతూ “డ్రెస్సింగ్ రూమ్లో అందరూ చాలా నిరాశలో ఉన్నారు. ఈ మ్యాచ్ పాకిస్థాన్కు ఎంత ముఖ్యమో ఆటగాళ్లకు తెలుసు. అందుకే ఈ ఓటమి వాళ్లను మానసికంగా బాగా దెబ్బతీసింది” అని తెలిపాడు.
భారత్ ఇన్నింగ్స్లో ఇషాన్ కిషన్ అద్భుతంగా 77 పరుగులు చేసి జట్టును నిలబెట్టాడు. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ అవుటైనా, కిషన్ పోరాటంతో స్కోరు మెరుగైంది. తర్వాత సూర్యకుమార్ యాదవ్ (32), శివమ్ దూబే (27) కీలక పాత్ర పోషించారు. దాంతో భారత్ 175/7 స్కోరు సాధించింది.
176 పరుగుల లక్ష్య చేధనలో పాకిస్తాన్ బ్యాటర్ ఆర్డర్ ఘోరంగా కుప్పకూలిపోయింది. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా దెబ్బకు రెండో ఓవర్లోనే సైమ్ అయూబ్, కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా పెవిలియన్ చేరారు. దాంతో పాకిస్తాన్ 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. తర్వాత ఉస్మాన్ ఖాన్ 44 పరుగులతో కొంత పోరాటం చేసినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. పాకిస్తాన్ 18 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇది భారత్పై వారి మూడో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.
టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంపై హెస్సన్ స్పందిస్తూ “ఆరంభంలో పిచ్ స్పిన్కు సహకరించింది. బంతి బాగా తిరిగింది. మొదట బాగా మొదలెట్టాం. కానీ కిషన్ ఆటతో మ్యాచ్ మాకు దూరమైంది” అని చెప్పాడు. ఈ ఓటమితో వరల్డ్ కప్ల్లో భారత్పై పాకిస్తాన్ రికార్డు మరింత దిగజారింది. మొత్తం తొమ్మిది మ్యాచ్ల్లో ఒక్క విజయం మాత్రమే సాధించింది. ప్రస్తుతం భారత్ వరుసగా మూడో గెలుపుతో సూపర్ 8కు అర్హత సాధించింది.
చివరిగా హెస్సన్ మాట్లాడుతూ “మేం మళ్లీ నిలదొక్కుకోవాలి. రెండు మూడు రోజుల్లో మరో మ్యాచ్ ఉంది. ఇప్పటివరకు మేం మంచి క్రికెట్ ఆడాం. ఇంకా టోర్నీలో బలంగా తిరిగి రావచ్చు” అని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రూప్ స్టేజ్లో పాకిస్తాన్ నమీబియాతో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ పాక్కు అత్యంత కీలకంగా మారింది. ఆ మ్యాచ్లో గెలిస్తేనే పాక్ సూపర్ 8కి చేరే అవకాశం ఉంటుంది.