అభిషేక్ శర్మపై సునీల్ గవాస్కర్ ఫైర్
- Author : Vamsi Chowdary Korata
Date : 23-02-2026 - 12:34 IST
Published By : Hashtagu Telugu Desk
Sunil Gavaskar ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతుండటంపై సునీల్ గవాస్కర్ కీలక సూచనలు ఇచ్చాడు. మొదటి బంతికే భారీ షాట్లు ఆడే అలవాటు తగ్గించుకుని, ఓపికగా ఇన్నింగ్స్ నిర్మించుకోవాలని సూచించాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో సెమీఫైనల్ అవకాశాలు కష్టమయ్యాయి. జింబాబ్వే, వెస్టిండీస్తో మ్యాచ్లు కీలకంగా మారాయి. రెండు మ్యాచ్లలో ఒక్కటి ఓడిపోయినా భారత్ సెమీస్ ఆశలు నిరాశే అని చెప్పొచ్చు.
ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఓపెనర్ల ఫామ్ ఒకటిగా మారింది. వరుసగా నాలుగో మ్యాచ్లోనూ ఓ భారత ఓపెనర్ డకౌట్ కావడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ తొలి ఓవర్లోనే ఔటవ్వగా, అందరి దృష్టి అభిషేక్ శర్మపై పడింది.
టోర్నమెంట్ మొత్తం పరుగులే చేయని అభిషేక్, ఈ మ్యాచ్లో తొలుత బౌండరీ, ఆ తర్వాత కగిసో రబడాపై సిక్సర్ బాదడంతో ఆశలు పెరిగాయి. కానీ ఆ తర్వాత మళ్లీ తడబడ్డాడు. చివరకు మార్కో యాన్సన్ బౌలింగ్లో ఔటయ్యాడు. అదే సమయంలో తిలక్ వర్మ కూడా విఫలమవ్వడంతో భారత్ 26/3కి కుప్పకూలింది. అక్కడి నుంచి కోలుకోలేక 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై 76 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈ ఓటమి తర్వాత భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిషేక్కు కీలక సూచనలు ఇచ్చాడు. అతడు ఆరంభం నుంచే భారీ షాట్లు ఆడే ప్రయత్నం తగ్గించుకోవాలని, కాస్త ఓపికగా ఆడాలని సూచించాడు. “అభిషేక్కు అన్ని రకాల షాట్లు ఉన్నాయి. కానీ ప్రతి ఇన్నింగ్స్ను మొదటి బంతికే బౌండరీ లేదా సిక్సర్తో ప్రారంభించాల్సిన అవసరం లేదు. ముందు సింగిల్ తీసుకుని ఖాతా తెరవాలి. నాలుగు డాట్ బాల్స్ వచ్చినా పెద్ద సమస్య కాదు. తర్వాత వాటిని కవర్ చేయగలడు” అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.
అమెరికా, పాకిస్తాన్, నెదర్లాండ్స్తో మ్యాచ్ల్లో డకౌట్లు నమోదు చేసిన అభిషేక్, ఇప్పుడు మళ్లీ విఫలమయ్యాడు. ఆసియా కప్లో టాప్ స్కోరర్గా నిలిచి జట్టుకు ట్రోఫీ అందించిన ఆటగాడు ఇలా వరుసగా తడబడడం అభిమానులను నిరాశపరిచింది. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో నాగ్పూర్, గువాహటిల్లో మెరిసినా, మధ్యలో డకౌట్లు రావడం ఆందోళన కలిగిస్తోంది. చివరి తొమ్మిది ఇన్నింగ్స్ల్లో ఐదు సార్లు సున్నాకే పరిమితమవడం అతడి ఫామ్పై ప్రశ్నలు పెంచింది.
అయితే జట్టు మేనేజ్మెంట్ ఇప్పటికీ అతడిపై నమ్మకం కొనసాగిస్తోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ అతడిని తప్పించే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. భారత్ తదుపరి మ్యాచ్ను జింబాబ్వేతో చెన్నై చిదంబరం స్టేడియంలో ఆడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్తో ఈడెన్ గార్డెన్స్లో పోటీ ఉంది. సెమీఫైనల్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఈ రెండు మ్యాచ్ల్లోనూ భారీ విజయాలు తప్పనిసరి.