Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..
- Author : Vamsi Chowdary Korata
Date : 09-07-2026 - 9:18 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఐదు రోజులపాటు నైరుతి గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. రైతులు, కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో నిలబడకూడదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్పై ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది. కొద్దిరోజులుగా తేలికపాటి వర్షాలు మినహా పెద్దగా ఎక్కడా వర్షాలు లేవు. నైరుతి రుతుపవనాలు విస్తరించినా ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. వానలు పడకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.. ఖరీఫ్ పంటలపై ప్రభావం కనిపిస్తోందంటున్నారు. ఈ ఏడాది ఇదే పరిస్థితి కొనసాగితే నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీపై ఎల్నినో ప్రభావం ఉంటుందనే ముందస్తు అంచనాలతో ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ పంటలను సూచించింది. ఈ మేరకు రైతులకు అవగాహన కూడా కల్పించారు.
ఆంధ్రప్రదేశ్ హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత APSDMA (విపత్తుల నిర్వహణ సంస్థ) కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో నైరుతి రుతుపవనాలు, ఎల్-నినో ప్రభావంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. విపత్తుల వల్ల ఏ ఒక్క ప్రాణనష్టం జరగకుండా చూడటమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని ఆమె ఆదేశించారు. ముఖ్యంగా ఎల్-నినో ప్రభావం ఎక్కువగా ఉన్న రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వర్షభావ పరిస్థితులపై దృష్టి సారించి, కరవు ముప్పు ఉన్న మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అదే సమయంలో, వరద ముప్పు ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపునకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, పునరావాస కేంద్రాలలో వసతులు కల్పించాలని మరియు పోలీస్, ఫైర్, NDRF, APSDRF బృందాలు అత్యవసర స్పందనకు సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.