Telangana: బైక్ ర్యాలీలో అపశృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు..!
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా మంజూరైన మెడికల్ కాలేజీ, మొదటి సంవత్సరం మెడికల్ స్టూడెంట్స్ తరగతులు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
- By Gopichand Published Date - 03:00 PM, Tue - 15 November 22
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా మంజూరైన మెడికల్ కాలేజీ, మొదటి సంవత్సరం మెడికల్ స్టూడెంట్స్ తరగతులు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి మంత్రులు రానున్నట్లు జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు చింత ప్రభాకర్ వెల్లడించారు. ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న మంత్రులకు టీఆర్ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీతో స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గులాబీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీగా వెళ్తున్న క్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బాణాసంచాతో వెళ్తున్న ఆటో దగ్ధం కావడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 8 మెడికల్ కాలేజీలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి వర్చువల్ పద్ధతిలో 8 కళాశాలల్లో తరగతులను ప్రారంభించారు. తెలంగాణ చరిత్రలో ఇది కొత్త అధ్యాయం అని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో గతంలో 850 మెడికల్ సీట్లు ఉంటే, ఇప్పుడు 2790 సీట్లకు పెరిగాయని వెల్లడించారు. త్వరలో 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలను నిర్మిస్తామని వెల్లడించారు. అలాగే నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఎన్నో రకాల వైరస్లు పట్టిపీడిస్తాయని, వాటిని ఎదుర్కొనేలా వైద్య రంగాన్ని పటిష్టం చేస్తామని తెలిపారు.
సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్కర్నూల్, రామగుండంలో ఎనిమిది కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఒకేసారి ఎంబీబీఎస్ కార్యక్రమాలను ప్రారంభించాయి. ఎనిమిది జిల్లాల కలెక్టర్లు, ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ. 4,080 కోట్లతో నిర్మించిన ఈ కొత్త వైద్య కళాశాలల వల్ల తెలంగాణలో మొత్తం 1,150 MBBS సీట్ల సంఖ్య పెరగనుంది. ఈ యూనివర్సిటీల్లో ఇటీవలే అడ్మిషన్లు పూర్తయ్యాయి. 2014 వరకు తెలంగాణలో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి.
Related News
Rain Alert : మే 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తమగు చిరు జల్లులు పలకరిస్తూ చల్లపరుస్తూ వస్తున్నాయి. ఇక నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం పడింది