Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- Author : Vamsi Chowdary Korata
Date : 12-05-2026 - 5:45 IST
Published By : Hashtagu Telugu Desk
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. వరుసగా రెండో సెషన్లో కూడా అమ్మకాల సునామీ కొనసాగింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమనడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా అన్ని రంగాల షేర్లలోనూ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,456.04 పాయింట్లు పతనమై 74,559.24 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 436.3 పాయింట్లు నష్టపోయి 23,379.55 వద్ద ముగిసింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో ఇంధన వినియోగం, విదేశీ ప్రయాణాలు, బంగారం కొనుగోళ్లు తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునివ్వడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను మరింత బలహీనపరిచింది. ఈ వ్యాఖ్యలతో పశ్చిమాసియా సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం చూపుతుందనే భయాలు తీవ్రమయ్యాయి.
బ్రాడర్ మార్కెట్లో నష్టాలు మరింత ఎక్కువగా ఉన్నాయి. నిఫ్టీ మిడ్క్యాప్ సూచీ 2.54 శాతం, స్మాల్క్యాప్ సూచీ 3.17 శాతం మేర పతనమయ్యాయి. రంగాల వారీగా చూస్తే ఐటీ, రియల్టీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, టైటాన్, టీసీఎస్ వంటి షేర్లు 4.44 శాతం వరకు నష్టపోయాయి. సెన్సెక్స్ 30 షేర్లలో ఎస్బీఐ మాత్రమే లాభాల్లో ముగియడం గమనార్హం.
సాంకేతిక విశ్లేషకుల ప్రకారం, నిఫ్టీకి తక్షణ మద్దతు 23,300 వద్ద, ఆ తర్వాత 23,100 వద్ద ఉందని చెబుతున్నారు. ఎగువ స్థాయిలో 23,500 తక్షణ నిరోధకంగా మారింది. క్రూడ్ ఆయిల్ ధరలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా సమీప భవిష్యత్తులో మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, పటిష్ఠమైన దేశీయ ఆర్థిక మూలాలు మార్కెట్లకు మద్దతుగా నిలుస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.