YS Jagan Defamation: రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేయనున్న వైఎస్ జగన్!
అదానీతో భేటీకి విద్యుత్ ఒప్పందాలకు ఎటువంటి సంబంధం లేదని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ఛార్జీషీట్లో ఎక్కడా తన పేరు లేదన్నారు. తన పరువు ప్రతిష్టలు తీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
- Author : Gopichand
Date : 28-11-2024 - 6:28 IST
Published By : Hashtagu Telugu Desk
YS Jagan Defamation: ఏపీ ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు (YS Jagan Defamation) చేశారు. అలాగే అదానీ వ్యవహారంలో తనను అనవసరంగా లాగుతున్నారని జగన్ మండిపడ్డారు. అలాగే తనపై తప్పుడు ప్రచారం చేసేవారికి త్వరలోనే లీగల్ యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. అంతేకాకుండా రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని ఆయన ప్రకటించారు.
కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్తో ప్రజలకు భరోసా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. ఉచిత కరెంట్తో రైతులకు ఎంతో లాభాదాయకమని, కానీ కూటమి ప్రభుత్వంలో డిస్కంల పరిస్థితి దయనీయంగా పేర్కొన్నారు. రెడ్ బుక్తో రాష్ట్రంలో పాలనకు తూట్లు పోడిచారని మండిపడ్డారు.
తమ ప్రభుత్వంలోనే ఎన్నడూ ఊహించని మార్పులు తీసుకురాగలిగామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ‘‘నా పాదయాత్రలో కష్టాలను చూశా. అందుకు తగ్గట్లు గత ఐదేళ్ల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఇప్పుడు ఆ అడుగులు వెనక్కి ఎలా వెళ్తున్నాయో చూస్తున్నాం. లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకం ఇంటి వద్దకే డోర్ డెలివరీ ఇచ్చాం’ అని అన్నారు.
Also Read: Pushpa 2 : పుష్ప 2తో పోటీ ఎందుకని.. బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ పోస్ట్ పోన్..!
ఏపీ చరిత్రలోనే అత్యంత చౌకైన విద్యుత్ కొనుగోలు చేశామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ‘తక్కువ ధరకు విద్యుత్ కొంటే పొగడాల్సింది పోయి.. తిడుతున్నారు. సంపద సృష్టి నేను చేశాను.. చంద్రబాబు సంపద ఆవిరి చేస్తారు’ అని మండిపడ్డారు. వైసీపీ హయాంలో పగటిపూటే 9 గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చామని, కానీ టీడీపీ సర్కార్ రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వలేకపోతోందని ధ్వజమెత్తారు.
రూ. 100 కోట్ల పరువు నష్టం దావా
అదానీతో భేటీకి విద్యుత్ ఒప్పందాలకు ఎటువంటి సంబంధం లేదని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ఛార్జీషీట్లో ఎక్కడా తన పేరు లేదన్నారు. తన పరువు ప్రతిష్టలు తీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం చేసినవారికి లీగల్ నోటీసులు పంపిస్తామని చెప్పారు. తన పరువుకు భంగం కలిగించిన వారిపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేయబోతున్నట్లు వెల్లడించారు.