Vijayasai Reddy: అమరావతిపై చంద్రబాబుకు విజయసాయిరెడ్డి ట్వీట్
- Author : Vamsi Chowdary Korata
Date : 14-04-2026 - 10:32 IST
Published By : Hashtagu Telugu Desk
Amaravati కేంద్రం అమరావతికి చట్టబద్ధత కల్పించి రాజధానిగా ఖరారు చేసింది. ఇంతలో వైఎస్సార్సీపీ మావిగన్ పేరుతో కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతిపై కొన్ని సూచనలు చేశారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల గురించి ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి కొన్ని సలహాలు ఇచ్చారు. అలా చేస్తే బావుంటుందని చెప్పుకొచ్చారు.
Bengaluru was founded in 1537 by Kempe Gowda, Hyderabad in 1591 by Muhammad Quli Qutb Shah, and Chennai in 1639 by the British East India Company under Francis Day. It took 500, 430, and 380 years respectively for them to become the metropolitan cities they are today.
These…
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 14, 2026
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదనపై చర్చ జరుగుతున్న వేళ.. విజయసాయిరెడ్డి రాజధాని అంశంపై కొన్ని సలహాలు, సూచనలు చేస్తూ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. బెంగళూరును 1537లో కెంపె గౌడ, హైదరాబాద్ను 1591లో మహమ్మద్ కులీ కుతుబ్షా, చెన్నైని 1639లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రాన్సిస్ డే ఆధ్వర్యంలో స్థాపించారన్నారు. ఈ మూడు మహానగరాలుగా మారడానికి వందల సంవత్సరాలు పట్టిందని.. బెంగళూరుకు 500, హైదరాబాద్కు 430, చెన్నైకి 380 ఏళ్లు పట్టిందన్నారు. ఈ మూడు నగరాలు హడావిడిగా నిర్మించలేదని.. తరతరాలుగా రూపుదిద్దుకున్నాయన్నారు.
అమరావతిని అప్పుల డబ్బుతో, గొప్ప భ్రమలతో రాత్రికి రాత్రే నిర్మించలేమన్నారు విజయసాయిరెడ్డి. ముఖ్యంగా ప్రస్తుతం రాజధాని గురించి చెప్పుకుంటున్నట్లుగా సెల్ఫ్ ఫైనాన్సింగ్ (స్వయం సమృద్ధి) కాదన్నారు. అందుకే ముందుగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన గృహాల వంటి ప్రాథమిక సౌకర్యాలను నిర్మించాలన్నారు. అమరావతిలో నిర్మాణాలను అక్కడితో ఆపేసి.. ప్రజలు, వ్యాపారాలు, కాలంతో పాటు అమరావతి సహజసిద్ధంగా ఎదగనివ్వాలని సలహా ఇచ్చారు. రాజధాని నగరం అప్పులతో కాకుండా, బలంతో ఎదగాలన్నారు.
ఆకర్షణీయమైన డిజైన్లు, భారీ మౌలిక సదుపాయాలపై ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేయడం దార్శనికత కాదని, అది ఆర్థికంగా దుబారా అవుతుందన్నారు విజయసాయిరెడ్డి. ఈరోజు అనవసరంగా ఖర్చు చేసే ప్రతి రూపాయి రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై భారం అవుతుందన్నారు. ఆదాయం రాని ప్రాజెక్టులకు ఇచ్చే రుణాలు మంచిది కాదని.. పైగా అవి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారం మోపుతాయన్నారు. పరిపాలనకు కార్యాచరణ అవసరం ఉందని.. ఆడంబరమైన నిర్మాణం కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం జాగ్రత్తపడకపోతే అమరావతి ఒక ఆదర్శ రాజధానిగా కాదు.. ఒక భారీ దుబారా ప్రాంతంగా మారే ప్రమాదం ఉందన్నారు విజయసాయిరెడ్డి.
మరోవైపు అమరావతిలో సామాజిక న్యాయం కోసం ధర్మదీక్ష చేస్తున్న భారత చైతన్య యువజన (BCY) పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ బోడె రామచంద్ర యాదవ్కు తన సంపూర్ణమైన మద్దతు తెలియచేస్తున్నాను అంటూ మరో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. అంతేకాదు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి త్వరలోనే మీడియా రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు.