CM Chandrababu: మత్స్యకారులకు అండగా : సీఎం చంద్రబాబు
- Author : Vamsi Chowdary Korata
Date : 19-05-2026 - 1:47 IST
Published By : Hashtagu Telugu Desk
మత్స్యకారుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంటలో నేడు జరిగిన ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వేట నిషేధ భృతి కింద రాష్ట్రవ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ. 20 వేల చొప్పున, మొత్తం రూ. 262 కోట్ల ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “సముద్రంలో చేపల వేట అంటే ప్రాణాలతో చెలగాటమాడటమే. రోజుల తరబడి సముద్రంలోనే ఉండి జీవనోపాధి పొందుతున్న మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు ఉండే వేట నిషేధ సమయంలో వారి కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆర్థిక చేయూత అందిస్తున్నాం. గతంలో రూ.10 వేలుగా ఉన్న సాయాన్ని, మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.20 వేలకు పెంచాం” అని తెలిపారు. వరుసగా రెండో ఏడాది కూడా ఈ పథకం ద్వారా సాయం అందిస్తున్నామని, రెండేళ్లలో మొత్తం రూ.505 కోట్లను మత్స్యకారులకు అందించామని గుర్తుచేశారు.
మత్స్యకారులకు వరాల జల్లు
ఈ సభలో ముఖ్యమంత్రి మత్స్యకారుల కోసం పలు కీలక హామీలు ప్రకటించారు. 60 శాతం సబ్సిడీపై 200 కొత్త మెకనైజ్డ్ బోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన మొత్తాన్ని సులభ వాయిదాల్లో రుణంగా అందిస్తామని హామీ ఇచ్చారు. “తీరం మనది, బోటు మనదే, వేటా మనదే. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. మన తీరప్రాంతంలోకి పొరుగు రాష్ట్రాల బోట్లు వస్తే సహించేది లేదు. మత్స్యకారుల హక్కులను కాపాడటానికి నిఘా పెంచుతాం” అని చంద్రబాబు చెప్పారు.
రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి రూ. 3,256 కోట్లతో 9 ఫిషింగ్ హార్బర్లు, 8 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రూ. 288 కోట్లతో చేపడుతున్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఆర్థికంగా బలపడుతుందని, దీనిపై కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. నెల్లూరు జిల్లాలోని 25 మత్స్యకార గ్రామాలను కలుపుతూ మెటల్ రోడ్లు నిర్మిస్తామని, రూ.6.19 కోట్లతో నార్త్ బకింగ్హామ్ కెనాల్ పూడికతీత పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
అదనపు ఆదాయం.. సాంకేతికతపై దృష్టి
చేపల వేటతో పాటు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందాలని మత్స్యకారులకు సీఎం సూచించారు. “సీవీడ్ (సముద్రపు నాచు) సాగు ద్వారా మత్స్యకార మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతాం. దీనికి ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. మత్స్యకారులు పండించే చేపలకు మంచి ధర వచ్చేలా నేనే మార్కెటింగ్ మేనేజర్గా వ్యవహరిస్తా” అని భరోసా ఇచ్చారు. మత్స్యకారుల రక్షణ కోసం సముద్రంలో 4,550 ట్రాన్స్పాండర్లను ఏర్పాటు చేసి కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేశామని వివరించారు.
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసానికి గురైందని, దానిని సరిచేయడానికే 23 నెలల సమయం పట్టిందని చంద్రబాబు విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రభుత్వానికి తమ మద్దతు తెలిపారు. కృష్ణానదిలో బోట్లతో భారీ ర్యాలీ నిర్వహించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.