Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు
- Author : Vamsi Chowdary Korata
Date : 15-05-2026 - 11:58 IST
Published By : Hashtagu Telugu Desk
అంతా ఊహించినట్లుగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశీయంగా ఇంధన ధరలను సవరించాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.3 పెంచాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఆయిల్ ఉత్పత్తి, సరఫరాపై పడ్డ ప్రభావంతో దాదాపు నాలుగేళ్ల తర్వాత పెట్రో ధరల సవరణ తప్పలేదు. అయితే, ధరల పెరుగుదల పెట్రోల్, డీజిల్కు మాత్రమే పరిమితం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇతర నిత్యావసరాలూ ప్రియం అవుతాయని అంటున్నారు.
ఇంధన ధరల పెరుగుదల రానున్న రోజుల్లో ఆహారం, రవాణా, ఆన్లైన్ డెలివరీ ఛార్జీల వంటి వాటిపైనా ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు తెలిపారు. మొత్తంగా సామాన్యుడి నెలవారీ ఇంటి ఖర్చు భారంగా మారడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. రోజూ ప్రయాణం చేసేవారి జేబుకు ఛార్జీల రూపంలో చిల్లు పడక తప్పదంటున్నారు. అలాగే ఆటో, క్యాబ్ సహా గూడ్స్ క్యారియర్ వంటి రవాణా ఖర్చులూ భారంగా మారతాయని విశ్లేషిస్తున్నారు.
రవాణా ఛార్జీలు పెరిగితే తొలుత వాటి ప్రభావం ఉండేది ఆహార పదార్థాలపైనే. కూరగాయలు సహా కిచెన్ సరకులు రోడ్డు రవాణా ద్వారానే సరఫరా అవుతాయి. పాలు, పండ్లు, పప్పుధాన్యాలు సహా ప్యాకేజ్డ్ వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి. దీంతో కిచెన్ బడ్జెట్ కొండెక్కడం ఖాయం. ఇప్పటికే కొన్ని మిల్క్ బ్రాండ్స్ లాజిస్టిక్స్ ఖర్చుల పేరిట ధరల్ని పెంచాయి.
పెరిగిన డీజిల్ ధరలు గ్రామీణ ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రాక్టర్లు, పంపు సెట్లు, రవాణా వాహనాలు సహా ఇతర యంత్రాలు డీజిల్తోనే నడుస్తాయి. దీంతో సాగు వ్యయం అధికమవుతుంది. తిరిగి ఇది ఆహార ధరలు పెరగడానికి కారణమవుతుంది.
ఇంధన ధరలు ఎప్పుడూ అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగానే ఉండాలని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కావాలని ధరల్ని స్థిరంగా ఉంచితే ఆ ప్రభావం భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం అదుపు తప్పడం, నిత్యావసరాల కొరత వంటి దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరిస్తున్నారు.