Pastor Abhinay Darshan: పాస్టర్ అభినయ దర్శన్పై కత్తులతో దాడి..
- Author : Vamsi Chowdary Korata
Date : 19-05-2026 - 12:41 IST
Published By : Hashtagu Telugu Desk
భరోసా పార్టీ అధ్యక్షుడు, పాస్టర్ అభినయ దర్శన్పై దాడి ఘటన కలకలం రేపింది. ఆయన ఆస్పత్రిలో కోలుకున్నారు. తనపై జరిగిన దాడి ఘటనపై ఆయన స్పందించారు. తనను ప్రవీణ్ పగడాలలాగే హతమార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ దాడి ఘటనలో నిందితుల్ని వదిలేసి తన అనుచరుల్ని పోలీసులు అరెస్ట్ చేశారని, నిందను తనపైకే తోసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఎన్ని దాడులు జరిగినా వెనక్కు తగ్గేది లేదని అన్నారు.
భరోసా పార్టీ అధ్యక్షుడు, పాస్టర్ అభినయ దర్శన్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ, పాస్టర్ ప్రవీణ్ పగడాలలాగే తనను కూడా చంపాలని చూస్తున్నారని అన్నారు. గతంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల నాలుగు బ్రాండ్లు తాగి యాక్సిడెంట్లో చనిపోయినట్లు దొంగ సాక్ష్యాలు సృష్టించారని ఆయన ఆరోపించారు. పోలీసుల దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని, తనపై దాడి చేసిన వారిని వదిలేసి, తన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారని అన్నారు. తనపై తానే దాడి చేసుకున్నట్లు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని తెలిపారు. పోలీసులు తన విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్నారని, పాస్టర్లందరూ దొంగలే అనే తరహాలో చిత్రీకరిస్తున్నారని ఆయన ఘాటుగా స్పందించారు. తనపై దాడి వెనుక కుట్ర ఉందని, తనపై దాడి వ్యవహారంలో ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజుకి సంబంధం ఉందని తాను అనుకోవడం లేదని అన్నారు. కొంతమందిపై తనకు అనుమానం ఉందని, వారి పేర్లు త్వరలోనే బయట పెడతానని చెప్పారు.
తనపై ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదని, తాను ఈ గాయాల నుంచి కోలుకుని మళ్లీ పాడేరు వచ్చి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తానని అభినయ దర్శన్ అన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో సమస్యల గురించి తెలుసుకుంటున్నానని, వీటిని అధికారుల దృష్టికి తీసుకెళుతున్నానని అన్నారు. కొద్దిరోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని అన్నారు. తనపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా దాడి జరిగిన సమయంలో తన పక్కన ఉన్నవారిని పోలీసులు తీసుకెళ్లి బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాను ఎవరినీ టార్గెట్ చేసి మాట్లాడలేదని, ఎవరినీ విమర్శించలేదని అన్నారు. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని అన్నారు.
మరోవైపు పాస్టర్ అభినయ దర్శన్పై దాడి ఘటనలో తనపై ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు స్పందించారు. పాస్టర్ అభినయపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయనపై దాడి చేసిన వారిని ప్రజల ముందు పోలీసులు నిలబెట్టాలన్నారు. ఈ దాడి ఘటనపై తాను స్పందించి పోలీసులకు ఫోన్ చేసి పూర్తిస్థాయి విచారణ చేయాలని సూచించానన్నారు. ఈ దాడి తన అనుచరులు చేశారని కూటమి నాయకులు ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. ఒక గిరిజన బిడ్డపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కూటమి నేతలు తనకు క్షమాపణ చెప్పాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక వైఎస్సార్సీపీపై ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.