అంబటి రాంబాబు, జక్కంపూడి రాజాకు పోలీసుల షాక్..
- Author : Vamsi Chowdary Korata
Date : 21-02-2026 - 2:57 IST
Published By : Hashtagu Telugu Desk
Ambati Rambabu మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడంతో వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసును రాజమండ్రి ప్రకాశ్ నగర్ సీఐ బాజీలాల్ విచారణ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే… 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న అంబటి రాంబాబు రెండు రోజుల క్రితం బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈనెల 19న రాజమండ్రి నుంచి గుంటూరుకు బయలుదేరిన అంబటి రాంబాబుకు పోలీసులు సెక్షన్ 30 కింద నోటీసులు అందించారు. కార్లతో భారీ ఊరేగింపు నిర్వహించవద్దని, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై అధిక వాహనాలతో వెళ్లకూడదని నోటీసులో పేర్కొన్నారు. అయినప్పటికీ అంబటి, జక్కంపూడి రాజా తమ అనుచరులతో కలిసి కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో వారిపై కేసులు నమోదయ్యాయి.