Employees Fight: ఏపీ ఉద్యోగుల పోరు బాట! జగన్ టీమ్ దూరం, బాబు జట్టు ఉద్యమం!!
ఉద్యోగ సంఘాలకు , జగన్ ప్రభుత్వానికి మధ్య సంధి కుదరలేదు. పోరుబాట పట్టడానికి ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఇరు వర్గాలుగా చీలిపోయిన ఉద్యోగుల్లోని ఒక వర్గం
- Author : CS Rao
Date : 06-03-2023 - 3:40 IST
Published By : Hashtagu Telugu Desk
ఉద్యోగ సంఘాలకు , జగన్ ప్రభుత్వానికి మధ్య సంధి కుదరలేదు. పోరుబాట పట్టడానికి ఉద్యోగులు (Employees) సిద్ధమయ్యారు. ఇరు వర్గాలుగా చీలిపోయిన ఉద్యోగుల్లోని ఒక వర్గం ఉద్యమానికి సిద్ధం కావడం ఆసక్తి కలిగిస్తుంది. సమస్యలను పరిష్కరించాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ఈనెల 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్లు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ఇచ్చిన హామీలను గుర్తుచేసేందుకే ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు (Employees), ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను నాలుగేళ్లుగా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని బొప్పరాజు విమర్శించారు. అందుకే ఈ నెల 9 నుంచి రాష్ట్రవ్యాప్త ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేస్తామని ప్రకటించారు. ఇలా ఏప్రిల్ 3 వరకు దశల వారీగా ఉద్యమం చేస్తామని చెప్పారు. అప్పటికీ స్పందించకపోతే ఏప్రిల్ 5న జరిగే కార్యవర్గ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధమయ్యారు.
జగన్ ప్రభుత్వం ఉద్యోగులను (Employees) ఎందుకు నిర్లక్ష్యం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టబద్ధంగా తమకు రావాల్సినవి, తాము దాచుకున్న డబ్బులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీ ఇచ్చి మరిచిపోయిన అంశాలను గుర్తుచేయడానికే పోరు బాట పెట్టమని బొప్పారాజు వెల్లడించారు.
జీపీఎఫ్ సంగతేంటని, అలా దాచుకోవడమే నేరమా? అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. డీఏ అరియర్స్ లక్షలాది రూపాయలు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని వాపోయారు. సీపీఎస్ను వారం రోజుల్లో రద్దు చేస్తామన్నారు.. ఏమైందని ప్రశ్నించారు. ఏ హామీ ఇవ్వని రాష్ట్రాలు కూడా సీపీఎస్ రద్దు చేశాయని గుర్తు చేశారు.
‘‘రాజకీయ నాయకులు ఎందుకు పెన్షన్ తీసుకుంటున్నారు? మీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసుకోగలరా? ప్రజాప్రతినిధుల జీతాలను వారే నిర్ణయించుకుంటారు.. వారికి పీఆర్సీలతో సంబంధం లేదా?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పారని, ఎందుకు చేయలేదని నిలదీశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి ఉద్యమంలో పాల్గొనాలని బొప్పరాజు పిలుపునిచ్చారు. అయినప్పటికీ ఉద్యోగుల్లోని మరో వర్గం మాత్రం జగన్మోహన్ రెడ్డి కి జై కొడుతోంది. ఇలాంటి పరిస్తుతుల్లో జగన్ సానుకూల ఉద్యోగ సంఘాలు ఏమి చేస్తాయి? అనేది హాట్ టాపిక్ అయింది.
Also Read: Gold Sales: భారత ప్రభుత్వ గోల్డ్ బాండ్స్ సేల్స్ నేటి నుంచే.. ఇలా కొనండి