ప్రజా రాజధాని అమరావతిలో అంతర్జాతీయ న్యాయ వర్సిటీ
- Author : Vamsi Chowdary Korata
Date : 07-03-2026 - 3:06 IST
Published By : Hashtagu Telugu Desk
International Law University అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విద్యాసంస్థ ఏర్పాటుకు మరో కీలక అడుగు పడింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) – పెరల్ ఫస్ట్ ఐఐయూఎల్ఈఆర్ను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు అమరావతిలోని మందడం రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒప్పందం చేసుకున్నారు. అమరావతిలోని శాఖమూరు రెవెన్యూలో 55 ఎకరాల భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏర్పాటవుతోంది. రాజధానిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెరల్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఐఐయూఎల్ఈఆర్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. అమరావతిలోని మందడం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై ఏపీ సీఆర్డీఏ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెరల్ ట్రస్ట్ల తరఫున ప్రతినిధులు సంతకాలు చేశారు.
ఏపీ సీఆర్డీఏ ఐఐయూఎల్ఈఆర్ కోసం అమరావతిలోని శాఖమూరులో 55 ఎకరాల భూమిని భారత బార్ కౌన్సిల్ ట్రస్ట్ పెరల్ ఫస్ట్కు కేటాయించింది. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్, పెరల్ ఫస్ట్ చైర్మన్ ఎంపీ మనన్కుమార్ మిశ్రా ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అమరావతిలో ఈ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తే.. దేశంలోనే అత్యున్నతంగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో న్యాయవిద్య, పరిశోధనలు, ప్రొఫెషనల్ శిక్షణ అందుబాటులోకి వస్తుంది. ఈ యూనివర్శిటీ నిర్మాణానికి ఏకంగా రూ.300 కోట్లు దశలవారీగా కేటాయిస్తారు. ఈ నిధుల్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ పెరల్ ఫస్ట్ చూసుకుంటుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తే 200 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి అంటున్నారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ప్రత్యేక ప్రాజెక్టుల నిర్మాణం, పర్యవేక్షణకు సంబందించి ఏజీఐసీఎల్ (అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్)ని ఏర్పాటు చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం ఏజీఐసీఎల్ స్వయంప్రతిపత్తి గల సంస్థగా మార్చింది.. ఈ మేరకు బిజినెస్ రూల్స్లో సవరణ చేసింది. ఏపీ ప్రభుత్వం అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం స్మృతివనం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అభివృద్ధి వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్పెషల్ ప్రాజెక్టుల కోసం ఏజీఐసీఎల్ను కంపెనీల చట్టం కింద ఎస్పీవీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అమరావతిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఐకానిక్ భవనాలపై సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల (హెచ్ఓడీ) టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతనూ ఏజీఐసీఎల్కు అప్పగించింది ఏపీ ప్రభుత్వం.