రేవంత్ రెడ్డి అవినీతిపై 100 శాతం ప్రాణం పోయే దాకా పోరాడుతూనే ఉంటాం – కేటీఆర్
గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సీరియల్ మాదిరిగా మీడియా లీకులు ఇస్తూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారే తప్ప, ఒక్కటంటే ఒక్క అధికారిక సాక్ష్యమైనా చూపించగలిగారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని డిజిపి శివధర్ రెడ్డి గానీ, ఐజీలు గానీ గ్యారెంటీ ఇవ్వగలరా అని నిలదీశారు.
- Author : Sudheer
Date : 23-01-2026 - 12:33 IST
Published By : Hashtagu Telugu Desk
KTR Attends SIT Enquiry In Phone Tapping Case : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా వేదికగా చేసిన ప్రసంగం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం నిబద్ధతతో పని చేస్తున్నానని చెబుతూనే, గత ఐదారేళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిత్వ హననం (Character Assassination) పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో డ్రగ్స్ కేసులు, హీరోయిన్లతో సంబంధాలంటూ తనను ఇరికించాలని చూశారని, ఆ క్రమంలో తన కుటుంబాన్ని, పిల్లలను కూడా మానసిక క్షోభకు గురిచేశారని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల కుటుంబాలను ఏనాడూ రాజకీయాల్లోకి లాగలేదని, అక్రమ కేసులు పెట్టి వేధించలేదని ఆయన స్పష్టం చేశారు.

Ktr Sit
గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సీరియల్ మాదిరిగా మీడియా లీకులు ఇస్తూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారే తప్ప, ఒక్కటంటే ఒక్క అధికారిక సాక్ష్యమైనా చూపించగలిగారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని డిజిపి శివధర్ రెడ్డి గానీ, ఐజీలు గానీ గ్యారెంటీ ఇవ్వగలరా అని నిలదీశారు. కేవలం తనను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ విచారణలు సాగుతున్నాయని, దీనికి తాను భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ఒక “అటెన్షన్ డైవర్షన్ గేమ్” అని కేటీఆర్ అభివర్ణించారు. బీఆర్ఎస్ పార్టీ ఇటీవల బయటపెట్టిన సింగరేణి బొగ్గు కుంభకోణం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డ్రామాను నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం బామ్మర్ది కేంద్రంగా వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, దానిపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి అవినీతిపై మరియు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై తమ పోరాటం ఆగదని, కేసీఆర్ సైనికులుగా పోరాడి ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసే వరకు విశ్రమించబోమని కేటీఆర్ పునరుద్ఘాటించారు.