CM Revanth: తెలుగువారి హవా తగ్గింది.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలుగు భాషను గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో మా ప్రభుత్వ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నేను విదేశాలకు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో ఎంతోమంది తెలుగువారు నన్ను కలిశారు.
- By Gopichand Published Date - 09:10 PM, Sun - 5 January 25

CM Revanth: ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఎంతో సంతోషంగా ఉందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అలాగే తెలుగు భాషను మర్చిపోకూడదని గుర్తుచేశారు. హిందీ తర్వాత ఎక్కువ మాట్లాడే భాష తెలుగేనని సీఎం చెప్పారు. తెలుగు వాళ్లు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్నట్లు ఆయన గుర్తుచేశారు. ఎంత ఎత్తుకు ఎదిగినా తెలుగు భాషను మర్చిపోవద్దని కోరారు.
ప్రపంచ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మూడు దశాబ్దాల క్రితం దివంగత ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రపంచ తెలంగాణ సమాఖ్య ప్రారంభమైంది. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
Also Read: Tata Motors: టాటా మోటార్స్.. అమ్మకాల్లో దూసుకుపోయిన టాటా పంచ్!
దేశంలోనే హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. దేశ రాజకీయాల్లో ఎంతోమంది తెలుగువారు క్రియాశీలకంగా వ్యవహరించారు. నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, కాకా, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు లాంటి వారు ఆనాడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర వహించారు. కానీ ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తెలుగువారి ప్రాభవం తగ్గింది. రాజకీయం, సినీ, వాణిజ్య రంగాల్లో రాణించినా మన భాషను మరిచిపోవద్దు. పరభాషా జ్ఞానం సంపాదించాలి. కానీ మన భాషను గౌరవించాలని ఆయన పేర్కొన్నారు.
తెలుగు భాషను గౌరవిస్తూ ఈ మధ్య కాలంలో మా ప్రభుత్వ జీవోలను తెలుగులో ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. నేను విదేశాలకు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్లిన సందర్భంలో ఎంతోమంది తెలుగువారు నన్ను కలిశారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. తెలంగాణ రైజింగ్ నినాదంతో 2050 అభివృద్ధి ప్రణాళికలతో మేం ముందుకు వెళుతున్నాం. ప్రపంచంలో అత్యున్నత నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. తెలంగాణ, ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడేలా ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు.