Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..
- Author : Vamsi Chowdary Korata
Date : 29-06-2026 - 1:47 IST
Published By : Hashtagu Telugu Desk
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రభుత్వ కార్యక్రమాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ను చివరి నిమిషంలో రద్దు చేశారు. వర్షాల కారణంగా సభను హైదరాబాద్కు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మధిర నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సభను రద్దు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
సభను హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని ‘రైతు భరోసా పంపిణీ సదస్సు’గా నిర్వహించనున్నారు. కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని మంత్రులు, ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు ఇందులో పాల్గొనేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల్లోని రైతు వేదికల ద్వారా డిజిటల్, వర్చువల్ విధానంలో సమావేశాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించనున్నారు.