Weather Report: నైరుతి ఎఫెక్ట్.. తెలంగాణకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్
- Author : Vamsi Chowdary Korata
Date : 11-06-2026 - 9:25 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో వర్షాలు ఊపందుకున్నాయి. నైరుతి రుతుపవనాలతో పాటుగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, యూపీ నుంచి విదర్భ వరకు మరో ఉపరితల ద్రోణి ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతో మూడు రోజుల పాటు వానలు పడతాయంటున్నారు. మరోవైపు నైరుతి పవనాలు ఏపీలోకి ప్రవేశించినా విస్తరించడానికి సమయం పడుతుందని చెబుతున్నారు. రుతుపవనాలు విస్తరించగానే వర్షాలు ఊపందుకుంటాయని చెబుతున్నారు. బుధవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి.
తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ కొనసాగుతోంది. ఇటు ఉత్తరప్రదేశ్ నుంచి విదర్భ వరకు మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాబోయే నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలో విస్తరించే అవకాశం ఉందని, ఆ తర్వాత రాష్ట్రంలో వర్షాలు మరింతగా ఊపందుకుంటాయని భావిస్తున్నారు.
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా అవి ప్రస్తుతానికి జోగులాంబ గద్వాల జిల్లాలో మాత్రమే విస్తరించాయి. ఈ రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి సమయం పడుతుందని, ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవని చెబుతున్నారు. అయితే నాలుగు రోజుల్లో రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరించే అవకాశాలున్నాయి. బుధవారం పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు హైదరాబాద్లోని హిమాయత్నగర్లో 7 సెం.మీ., గచ్చిబౌలిలో 5 సెం.మీ., గోల్కొండలో 3 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్లో మంగళవారం కురిసిన భారీ వర్షం, కుంభవృష్టి బీభత్సం సృష్టించింది. మల్కాజిగిరి ప్రాంతంలో అత్యధికంగా 13 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వర్షంతో పాటుగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచాయి. ఈ వర్షం దెబ్బకు రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. ఆఫీసుల నుంచి అందరూ ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురయ్యాయి. అధికారులు, పోలీసులు, హైడ్రా సిబ్బంది రోడ్లపై వరద నీటిని దారి మళ్లించేందుకు ప్రయత్నించారు. చాలా వరకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, వాహనాలు నీళ్లలో చిక్కుకుపోయాయి. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి.
గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా కనిపించింది. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి సైబర్టవర్స్ వరకు ఇదే పరిస్థితి ఉంది. అంతేకాకుండా పలు చోట్ల మురుగునీటి పైపులైన్లు, వరద నాలాలు పొంగిపొర్లాయి, దీంతో కొన్ని రోడ్లు చెరువుల్లా మారాయి. హైదరాబాద్ మాత్రమే కాదు, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, నల్గొండ, సూర్యాపేట, నిర్మల్ తదితర జిల్లాల్లోనూ వానలు పడ్డాయి.