T20 World Cup Winning Captains: ఒకే ఫ్రేమ్లో ముగ్గురు T20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్లు.. చేపాక్లో మళ్లీ కలిసిన ధోని, రోహిత్, సూర్య.
- Author : Vamsi Chowdary Korata
Date : 02-05-2026 - 12:56 IST
Published By : Hashtagu Telugu Desk
టీమిండియాకు మూడు టీ 20 వరల్డ్కప్ టైటిళ్లను అందించిన ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఒకే ఫ్రేమ్లో కనిపించారు. ఈ ముగ్గురు లెజెండరీ కెప్టెన్లు తొలిసారి ఒకే ఫ్రేమ్లో కనిపించారు. ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరగనున్న చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా ఈ ముగ్గురూ ఫొటో దిగారు. సూర్యకుమార్ యాదవ్ను మధ్యలో ఉంచి ధోనీ, రోహిత్ చెరో వైపు ఉన్నారు.
One for the history books ✨ pic.twitter.com/JPNcXYms82
— Mumbai Indians (@mipaltan) May 1, 2026
వరల్డ్ క్రికెట్ ఫ్రేమ్లో టీమిండియాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 1983 వరల్డ్కప్తో మొదలైన భారత క్రికెట్ ప్రస్థానం 2026లో తారా స్థాయికి చేరింది. కేవలం పురుషులే కాకుండా మహిళా క్రికెటర్లు సైతం వరల్డ్ క్రికెట్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. ప్రపంచ క్రికెట్ పొట్టి ఫార్మాట్లో భారత్ను ఢీకొట్టగలిగే జట్టు లేదంటే అతిశయోక్తి కాదు. దానికి కారణం ముగ్గురు కెప్టెన్లు.. ఆ ముగ్గురు కెప్టెన్లు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే, ఆ ఫొటో చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది.
టీ20 వరల్డ్కప్లో అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే. అత్యధికంగా మూడు సార్లు ఛాంపియన్గా నిలవడమే కాకుండా, వరుసగా రెండు సార్లు ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది. 2007లో తొలిసారి మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు మొదటి ట్రోఫీని సొంతం చేసుకోగా.. ఎన్నోసార్లు చేతుల వరకూ వచ్చి చేజార్చుకున్న ట్రోఫీని రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ముద్దాడింది. ఇక హిట్మ్యాన్ లెగసీని కాపాడిన సూర్యకుమార్ యాదవ్.. 2026 టీ20 వరల్డ్కప్లో తిరుగులేని జట్టుగా నిలిచి టైటిల్ అందుకుంది.
ఈ ముగ్గురు లెజెండ్స్ ఇప్పటి వరకు ఒకే ఫ్రేమ్లో కనిపించే అవకాశం ఇప్పటి వరకు రాలేదు. ఐపీఎల్ 2026 పుణ్యమా అని ఇన్నాళ్లకు ఆ అవకాశం దక్కింది. చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా చెపాక్ స్టేడియానికి ముంబై ప్లేయర్లు చేరుకున్నారు. అక్కడ ఈ ముగ్గురు లెజెండ్స్ ఫొటో దిగడం విశేషంగా నిలిచింది.
తొలుత రోహిత్ శర్మ ఎంఎస్ ధోనీని పలకరించి, తలా భుజంపై చేతులు వేసి మైదానంలోకి తీసుకొచ్చాడు. అక్కడే ఉన్న సూర్యకుమార్ యాదవ్ను మధ్యలో ఉంచి.. ఎంఎస్ ధోనీ ఒక పక్క, మరో వైపు రోహిత్ శర్మ ఉండి ఫొటోకి పోజులిచ్చారు. ఈ ముగ్గురు లెజెండ్స్ని ఇలా ఒకే ఫ్రేమ్లో చూసిన ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. ఈ వీడియో, ఫొటోలను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.