Vijay Mallya: నాడు పెట్టిన పెట్టుబడికి నన్ను చూసి చాలా మంది నవ్వుకున్నారు: విజయ్ మాల్యా
- Author : Vamsi Chowdary Korata
Date : 26-03-2026 - 12:45 IST
Published By : Hashtagu Telugu Desk
Royal Challengers Bangalore ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే అత్యంత విలువైన ఫ్రాంచైజీగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియం ఏకంగా 1.78 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.16,500 కోట్లు) ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఈ చారిత్రక ఒప్పందంపై ఆర్సీబీ మాజీ అధినేత, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఫ్రాంచైజీని స్థాపించినప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ ఆయన భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు.
I would like to heartily congratulate the new owners of RCB. I wish them the very best and Godspeed with the most valuable IPL franchise. When I bought the franchise in 2008 for INR 450 crores, most people laughed at me and criticised my investment as a vanity project. Behind my…
— Vijay Mallya (@TheVijayMallya) March 26, 2026
ఆర్సీబీ కొత్త యజమానులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మాల్యా తన పోస్ట్ను ప్రారంభించారు. “ఆర్సీబీ కొత్త యజమానులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అత్యంత విలువైన ఐపీఎల్ ఫ్రాంచైజీతో వారి ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. 2008లో నేను రూ.450 కోట్లకు ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసినప్పుడు, చాలా మంది నన్ను చూసి నవ్వారు. అదొక ‘వ్యానిటీ ప్రాజెక్ట్’ అని విమర్శించారు. కానీ, ‘రాయల్ ఛాలెంజ్’ బ్రాండ్ను నిర్మించాలనే బలమైన ఆలోచనతోనే నేను దీనికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని పేరు పెట్టాను” అని మాల్యా వివరించారు.
తన పెట్టుబడి అనూహ్యంగా పెరగడంపై మాల్యా తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. “నాటి నా రూ.450 కోట్ల పెట్టుబడి నేడు రూ.16,500 కోట్లకు పెరగడం చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉంది. ఆర్సీబీ ఎప్పటికీ నా డీఎన్ఏలో ఒక భాగంగానే ఉంటుంది. యువ విరాట్ కోహ్లీని జట్టులోకి ఎంపిక చేయడం లాంటి ఎన్నో చెరగని జ్ఞాపకాలు ఈ ఫ్రాంచైజీతో ముడిపడి ఉన్నాయి. ఈరోజు కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా ఎదిగాడు” అని ఆయన గుర్తుచేసుకున్నారు.
మాల్యా చివరగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. “నా యాజమాన్యంలో, ఆ తర్వాత కూడా జట్టుకు మద్దతుగా నిలిచిన ఆర్సీబీ అభిమానులందరికీ ధన్యవాదాలు. ‘బెంగళూరు సింహం’ అయిన ఆర్సీబీకి మీ మద్దతును ఇలాగే కొనసాగించండి. నమస్కారం” అంటూ తన పోస్ట్ను ముగించారు.
ఆదిత్య బిర్లా గ్రూప్తో పాటు అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లాక్స్టోన్, డేవిడ్ బ్లిట్జర్ నేతృత్వంలోని బోల్ట్ వెంచర్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ కన్సార్టియంలో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ భారీ ఒప్పందంతో ఐపీఎల్లో ఆర్సీబీ అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీగా నిలిచింది.