Shreyas Iyer: సిరీస్ క్లీన్స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు
- Author : Vamsi Chowdary Korata
Date : 29-06-2026 - 9:16 IST
Published By : Hashtagu Telugu Desk
ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్ను కోల్పోయిన తర్వాత భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్ను అర్థం చేసుకోవడంలో, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటంలో ప్రత్యర్థి జట్టు తమకంటే మెరుగ్గా వ్యవహరించిందని అంగీకరించాడు.
ఐర్లాండ్తో జరిగిన రెండో టీ20లో ఒక పరుగు తేడాతో ఓడిన భారత్.. రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0తో చేజార్చుకుంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. ప్రత్యర్థి ఆటతీరును ప్రశంసిస్తూ తమ జట్టు లోపాలను ప్రస్తావించాడు.
‘‘పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో మేం సరిగా అంచనా వేయలేకపోయాం. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటంలోనూ వెనుకబడ్డాం. సింగిల్స్ను డబుల్స్గా మార్చడంలో కూడా తేడా కనిపించింది. ఆ విషయంలో ఐర్లాండ్ మమ్మల్ని పూర్తిగా మించిపోయింది’’ అని అయ్యర్ చెప్పాడు.
ఈ సిరీస్ తమకు నిరాశ కలిగించిందని, అయితే ఐర్లాండ్ చాలా ప్రొఫెషనల్గా ఆడిందని అయ్యర్ కొనియాడాడు. పిచ్పై వారికి స్పష్టమైన అవగాహన ఉందని, వారి ఫీల్డింగ్, బౌలింగ్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయని ప్రశంసించాడు.
టీ20 అరంగేట్రం చేసిన యువ పేసర్ ప్రిన్స్ యాదవ్పై అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్లో సాధించిన అనుభవాన్ని అతడు ఇక్కడ కూడా చక్కగా ఉపయోగించుకున్నాడని, అతడికి స్పష్టమైన బౌలింగ్ ప్రణాళికలు ఉన్నాయని తెలిపాడు. తొలి మ్యాచ్ ఆడిన సూర్యాంశ్ షెడ్గే కూడా ఈ అనుభవం నుంచి ఎంతో నేర్చుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఈ ఓటమితో భారత్ వరుసగా 16 టీ20 ద్వైపాక్షిక సిరీస్ల విజయ పరంపరకు తెరపడింది. అలాగే టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు తొలి సిరీస్లోనే పరాజయం చవిచూశాడు. ఇక భారత్ జట్టు జులై 1 నుంచి ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది.