Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..
- Author : Vamsi Chowdary Korata
Date : 29-06-2026 - 10:20 IST
Published By : Hashtagu Telugu Desk
ఏరువాక పున్నమిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు అని చంద్రబాబు పేర్కొన్నారు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతులు భూమిని, పశుసంపదను పూజించి ప్రకృతితో అనుసంధానమయ్యే విశిష్టమైన పండుగ ఏరువాక అని ఆయన వివరించారు. పాడిపంటలతో రైతుల ఇళ్లలో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ నిధులు జమ చేసి రైతులకు అండగా నిలిచామని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఎల్ నినో, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను రైతులు ధైర్యంగా అధిగమించాలని సూచించారు. ప్రకృతి సాగుతో పంటలు పండించి, మన భూమిని మరియు ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సూచనలు, సలహాలు పాటిస్తూ రైతన్నలు సాగులో సిరులు పండించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.