IND vs ENG 4th T20I: భారత్- ఇంగ్లాండ్ మధ్య నేడు నాలుగో టీ20.. ఈరోజు ముగిస్తారా?
పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య పోరు జరగనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుండగా నేడు నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది.
- Author : Gopichand
Date : 31-01-2025 - 11:41 IST
Published By : Hashtagu Telugu Desk
IND vs ENG 4th T20I: భారత్-ఇంగ్లండ్ మధ్య 5 మ్యాచ్ల టీ20 (IND vs ENG 4th T20I) సిరీస్లో 3 మ్యాచ్లు జరిగాయి. తొలి రెండు మ్యాచ్ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. కాగామూ డో మ్యాచ్లో పునరాగమనం చేసిన ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. ఈ సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. అయితే మూడో టీ20లో ఆటగాళ్ళ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. అయితే ఈరోజు జరగబోయే నాలుగో టీ20 కోసం భారత్ జట్టులో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య పోరు జరగనుంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగుతుండగా నేడు నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్లో టీమిండియా 2-1తో ముందంజలో ఉంది. మ్యాచ్లో టాస్ సాయంత్రం 6.30 గంటలకు, మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో తొలి, రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. మూడో టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు జరిగే మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ జట్టు సిరీస్ గెలవాలనే సంకల్పంతో రంగంలోకి దిగనుంది. అయితే పుణెలో టీమిండియాకు విజయం అంత సులువు కాదని గణంకాలు చెబుతున్నాయి.
Also Read: Stock Market: బడ్జెట్ 2025.. రేపు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా?
పుణెలోని ఈ గడ్డపై భారత జట్టు రికార్డు మిశ్రమంగా ఉంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ ఇప్పటివరకు నాలుగు టీ20 మ్యాచ్లు ఆడింది. ఈ సమయంలో భారత జట్టు రెండు మ్యాచ్ల్లో విజయం సాధించగా, రెండు మ్యాచ్ల్లో ఓటమిని చవిచూసింది. ఈరోజు జరగబోయే మ్యాచ్లో భారత్- ఇంగ్లాండ్ మధ్య గట్టి పోటీ ఉండేలా కనిపిస్తోంది.
పిచ్ రిపోర్ట్
పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పిచ్ స్పిన్నర్లకు సహాయకరంగా ఉంటుంది. ఇక్కడ మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు మంచి టర్న్ పొందే అవకాశాలు ఉన్నాయి. మైదానం చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సిక్సర్లు, ఫోర్లు కొట్టడం అంత కష్టంగా ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ మంచు ప్రభావం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది.
యువ ఫినిషర్ రింకూ సింగ్ ఫిట్గా మారడం భారత్కు శుభవార్త. రింకూ ఈరోజు జరిగే మ్యాచ్లో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ధృవ్ జురెల్ జట్టు నుంచి బెంచ్కి పరిమితం కావొచ్చు. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఈ మ్యాచ్కు దూరం అయ్యే అవకాశం ఉంది. అతని స్థానంలో శివమ్ దూబే లేదా రమణదీప్ సింగ్కు సూర్యకుమార్ యాదవ్ అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.