Guntur woman case: గుంటూరులో మహిళను వివస్త్ర కేసులో 9 మంది అరెస్ట్
- Author : Vamsi Chowdary Korata
Date : 20-07-2026 - 12:45 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నగరంలో ఒక మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసి, తీవ్రంగా వేధించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కృష్ణాబాబు కాలనీకి చెందిన బాధితురాలు తన ఇంటి తాగునీటి పైప్లైన్కు నీళ్ల మోటారును అమర్చుకోగా, స్థానిక నిందితుడైన మల్లెల వెంకట రమణమూర్తి ఆమెను రూ.10,000 లంచం డిమాండ్ చేశాడు. అందుకు ఆమె భర్త నిరాకరించడంతో, రమణమూర్తి అధికారులతో మాట్లాడి ఆ మోటారును తొలగించే ప్రయత్నం చేశాడు. ఈ విషయమై బాధితురాలు పోలీసులను ఆశ్రయించి వచ్చిన కొద్దిసేపటికే తీవ్ర ఆగ్రహానికి గురైన మల్లెల రమణమూర్తి.. తన కుటుంబ సభ్యులతో పాటు ట్రాన్స్జెండర్లను పిలిపించి బాధితురాలి ఇంటిపై దాడికి తెగబడ్డాడు. ఆమెను ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి, బట్టలు చింపేసి, నడిరోడ్డుపై వివస్త్రను చేసి అత్యంత అమానుషంగా కొట్టారు.
ఈ అమానవీయ ఘటనపై స్పందించిన గుంటూరు ఎస్పీ వాకుల్ జిందాల్ (SP Vakul Jindal), నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడు మల్లెల రమణమూర్తితో పాటు ఈ దాడిలో పాల్గొన్న కుటుంబ సభ్యులు మరియు ట్రాన్స్జెండర్లను మొత్తంగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు అధికార పార్టీకి చెందిన వాడైనప్పటికీ, మహిళల భద్రత విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేస్తూ, మల్లెల రమణమూర్తిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతేకాకుండా, బాధితురాలు ఫిర్యాదు చేసినప్పుడు తక్షణమే స్పందించని స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్పై (CI) కూడా బదిలీ వేటు వేస్తూ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.