Assembly Elections:ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. దేశ రాజకీయాలను మార్చనున్న ఆరు అంశాలు
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవాలో అధికారం చేజిక్కించుకోబోయేదెవరు అనే ప్రశ్న.. ఎన్నో సమాధాలు ఇవ్వబోతోంది. గెలుపోటముల బట్టే కొత్త నాయకత్వం బయటపడబోతోంది. మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో ఆరు అంశాలు కీలకంగా మారబోతున్నాయి.
- By Hashtag U Published Date - 09:10 AM, Mon - 10 January 22
ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్ హీట్ మొదలైంది.
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవాలో అధికారం చేజిక్కించుకోబోయేదెవరు అనే ప్రశ్న.. ఎన్నో సమాధాలు ఇవ్వబోతోంది. గెలుపోటముల బట్టే కొత్త నాయకత్వం బయటపడబోతోంది. మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో ఆరు అంశాలు కీలకంగా మారబోతున్నాయి.
బీజేపీ, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్: ఎక్కువమంది ఎమ్మెల్యేలు, ఎక్కువ మంది ఎంపీ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్లో బీజేపీ రాజ్యమేలుతోంది. పంజాబ్ రాజకీయాల్లో ఎన్ని భూకంపాలు వచ్చినా తట్టుకుని అధికార కుర్చీ కాపాడుకుంటూ వస్తోంది కాంగ్రెస్. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం నిలుపుకోవడం అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కి ప్రెస్టేజ్ ఇష్యూ. పార్లమెంట్లో కాంగ్రెస్కు అంతో ఇంతో బలం ఉందంటే అందుకు కారణం పంజాబే. చేతి గుర్తు పార్టీకి ఉన్న 52 లోక్సభ ఎంపీల్లో 20 శాతం పంజాబ్ నుంచి వచ్చినవే. రెండో దఫాలోనూ యూపీ ఇచ్చిన లోక్సభ స్థానాల కారణంగానే బీజేపీ అత్యంత శక్తివంతమైన పార్టీగా మారింది. బీజేపీకి వచ్చిన 301 లోక్సభ స్థానాల్లో 62 సీట్లు బీజేపీ గెలుచుకుంది. అంటే 20 శాతం సీట్లు ఒక్క యూపీ నుంచి వచ్చినవే. పైగా ఈసారి పోరు కేవలం బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పరిమితం అవలేదు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఈ రెండు పార్టీల మధ్యే పోటీ ఉన్నా.. యూపీ, పంజాబ్ విషయానికొస్తే పరిస్థితి అలా కనిపించడం లేదు. పంజాబ్, యూపీలో వాటా కోసం ప్రత్యర్థులు కూడా బలం పుంజుకుంటున్నారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ గతంలో కంటే బలంగా కనిపిస్తోంది. పంజాబ్లో ఆమ్ఆద్మీ పార్టీ సంచలనాలు సృష్టించడానికి రెడీ అవుతోంది.
మైనారిటీ సాధిస్తేనే మెజారిటీ:
బీజేపీ చాలా బలంగా కనిపిస్తున్నప్పటికీ.. పంజాబ్లో మాత్రం చాలా బలహీనం. ఆ రాష్ట్రంలో జెండా ఎగరేయడం కమలదళానికి అంత ఈజీ కాదు. అలాగే, ఉత్తర ప్రదేశ్లాంటి పెద్ద రాష్ట్రాన్ని, బీజేపీ పాతుకుపోయిన రాష్ట్రాన్ని జయించడం కాంగ్రెస్కూ అంత సులభం కాదు. పైగా మైనారిటీ వర్గాలు బీజేపీని ఇంకా పూర్తిస్థాయిలో నమ్మే పరిస్థితి రాలేదు. పంజాబ్లో సిక్కులను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ఎన్నో వ్యూహాలు రచిస్తున్నప్పటికీ.. వారి మనసులు గెలవలేకపోయిందనే చెప్పాలి. ఎందుకంటే, పంజాబ్లో ఎక్కువ మంది రైతులే. మూడు సాగు చట్టాలు తెచ్చినప్పటి నుంచి మోదీ ప్రభుత్వంపై పీకల్లోతు కోపం పెంచుకున్నారు రైతులు. చట్టాలను వెనక్కి తీసుకుని, సాక్షాత్తు ప్రధానే క్షమాపణ చెప్పినప్పటికీ 500 రైతుల మరణం బీజేపీని దూరంగానే నిలబెడుతోంది. అదే సమయంలో కాంగ్రెస్పై మైనారిటీ వర్గాల నమ్మకం ఏమాత్రం సడలిపోలేదు. ప్రాంతీయంగా, నిజయోకవర్గాల వారీగా మైనారిటీ పాప్యులేషన్ చెప్పుకోదగిన సంఖ్యలో ఉండడం కాంగ్రెస్కు కలిసొచ్చే అంశం. దీంతో కమ్యూనల్ పోలరైజేషన్ అనే సూత్రం బీజేపీకి వర్కౌట్ కాదనే చెప్పాలి. ఓవరాల్గా మైనారిటీ వర్గాలు బీజేపీని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాయన్నది నిజం. అంటే, కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడం బీజేపీకి అంత సులభమైతే కాదు. అలాగని, బీజేపీ ఊరికే చేతులు కట్టుకుని కూర్చోలేదు. సిక్కులలో నమ్మకం పెంచుకోడానకి పాకిస్తాన్లోని కర్తార్పూర్ను ప్రయోగించింది. అటు గోవాలోనూ క్యాథలిక్స్ తో స్నేహబంధం ఏర్పరచుకోడానికి ప్రయత్నిస్తోంది. గోవాలో మూడోవంతు జనాభా క్రిస్టియన్లే. ఈ ఓట్లను తన ఖాతాలో వేసుకునేందుకే పోప్ను కలిసి వచ్చారు. ఇండియాకు రావాలని పోప్ను ఆహ్వానించడం వెనక కారణం గోవా ఎన్నికలేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. మొత్తానికి ఇన్ని ఈక్వేషన్ల మధ్య అటు పంజాబ్లో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ, ఉత్తర ప్రదేశ్లో అడుగుపెట్టాలని కాంగ్రెస్ తెగ ప్రయత్నిస్తు్న్నాయి.
కొత్త నాయకులు పుట్టుకొస్తారా?
యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు యూపీ హీరో. ఉత్తర ప్రదేశ్లో మరోసారి బీజేపీ అధికారం చేజిక్కించుకుంటే మాత్రం మోదీ వారసుడిగా ఎదగడం ఖాయం. ఆ ఇమేజ్ అక్కడితోనే ఆగిపోదు హిందువుల్లో అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్గా మారతారు. దేశంలోని హిందువుల్లో అధికశాతం మంది యోగి వైపు చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. యోగి మళ్లీ గెలిస్తే.. రాష్ట్ర ఎల్లలను చేరిపేస్తూ.. మరే ముఖ్యమంత్రికి అందనంత హోదా దక్కుతుంది. యోగి మరోసారి అధికారం చేజిక్కించుకుంటే మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా నిలబడడం ఖాయం. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే.. యూపీలో ఆ పార్టీకి స్టార్ క్యాంపైనర్ ప్రియాంక గాంధీనే. పార్టీ ఇన్ఛార్జిగా యూపీ ఎన్నికల బాధ్యతను తన భుజస్కందాలపై మోస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపినా.. జాతీయ స్థాయిలో ఆ పార్టీకి కొత్త నాయకత్వం దొరికినట్టే. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లోనూ ప్రియాంక గాంధీ తన నిర్ణయాలు, వ్యూహాలను అమలు చేస్తున్నారు. పంజాబ్ పగ్గాలు నవజ్యోత్సింగ్ సిద్ధూకు ఇవ్వడం వెనకున్నది ప్రియాంకనే. పంజాబ్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. ప్రియాంక గాంధీ అనే నాయకత్వం వెనక కాంగ్రెస్ నడిచినా ఆశ్చర్యం లేదు.
ప్రాంతీయ పార్టీలకు అతిపెద్ద పరీక్ష:
సమాజ్వాదీ పార్టీ.. యూపీలో వెనబడిన తరగతుల వారిని నడిపిస్తున్న ఓ బలమైన వర్గం. పంజాబ్లో శిరోమణి అకాళీదళ్ మైనారిటీ వర్గానికి నాయకత్వం వహిస్తోంది. భారత రాజకీయాల్లో.. మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లో మాత్రమే కనిపించే విభిన్నత ఇది. కాని, సాంప్రదాయంగా వస్తున్న ఈ స్ట్రాటజీ ఆ పార్టీలను ప్రతిసారీ విజయతీరాలకు చేరుస్తాయా అంటే.. కొద్దిగా అనుమానమే. ఓ వర్గాన్నే ఎక్కువగా చేరదీస్తారనే ముద్ర కారణంగానో ఏమో.. ఈసారి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి ప్రాంతీయ పార్టీలు. పైగా తాము అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి ఇప్పటికీ ఆ పార్టీలను వెంటాడడం వారి విజయాలను మరింత ప్రశ్నార్ధకం చేస్తున్నాయి.
అగమ్యం.. దళిత రాజకీయం:
దేశ రాజకీయాల్లో దళితులు నిర్ణయాత్మక శక్తిగా మారారు. దళితులకు తామే పెద్ద దిక్కుగా చెప్పుకునే బహుజన సమాజ్ పార్టీ కొన్నేళ్ల క్రితం రాజకీయాలను, అధికారాన్నీ ఏలింది. ప్రస్తుతం ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. ఏ రాష్ట్రంలోనూ అధికారం దక్కించుకోవడం కాదు కదా.. కనీసం ప్రభావం చేసే పరిస్థితిలో కూడా లేదు. మరోవైపు ఉత్తర ప్రదేశ్లో దళిత ఓట్లను ఆకర్షించడంలో అధికార బీజేపీ కొంత సక్సెస్ అయినట్టేనని చెప్పొచ్చు. ఒకరకంగా బీఎస్పీ వాటానే కొంత వరకు లాక్కుంది. పంజాబ్లో దళిత ఓట్లు ఎక్కువగా ఉన్నా, ఎంతో కొంత ప్రభావం చూపగలిగినా.. అధికారం దక్కించుకునేంత పొజిషన్లో అయితే లేదు బీఎస్పీ. పంజాబ్లో దళితుడైన చరణ్జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్. దీంతో దళిత ఓటు బ్యాంకునే నమ్ముకున్న బీఎస్పీకి పంజాబ్లో గట్టి దెబ్బ తగిలినట్టైంది. మొత్తానికి దళితులు ఎవరి వైపు ఉంటారన్న దాన్ని బట్టి బీజేపీ, కాంగ్రెస్ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.
బీజేపీకి పోటీగా నాన్-కాంగ్రెస్ ప్రత్యామ్నాయం:
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు 2024ను ప్రభావితం చేయబోతున్నాయి. కేంద్రంలో ప్రత్యామ్నాయం ఎవరనేది ఈ ఎన్నికలు కూడా నిర్దేశించబోతున్నాయి. బీజేపీ ఉండకూడదు, అలాగని కాంగ్రెస్కు అధికారం అప్పగించకూడదు. ఇదే లక్ష్యంతో అటు కేజ్రీవాల్, ఇటు మమత బెనర్జీ పావులు కదుపుతున్నారు. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాల బట్టే ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఉంటాయి. పైగా 2024లో మోదీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే వీలుంటుంది. అందుకే, పంజాబ్పై ప్రత్యేక ఫోకస్ పెంచారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. 2017 పంజాబ్ ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది ఆమ్ఆద్మీ పార్టీ. ఇప్పుడు ఏకంగా అధికారం కోసం గట్టి ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు గోవాపై కన్నేసింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు గోవాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ. మణిపూర్లోనూ పాగా వేసేందుకు గట్టి యాక్షన్ ప్లాన్తో దిగారు. కేంద్ర పీఠాన్ని అధిరోహించేందుకు ప్రాంతీయంగా తమ బలాన్ని పోగు చేసుకుంటున్నారు ఈ ఇద్దరు. దారులు భిన్నంగా ఉన్నా, లెక్కలు విభిన్నంగా ఉన్నా 2024 లక్ష్యంగా ఎవరి వ్యూహాలు వారు అమలుపరుస్తున్నారు.
Tags
Related News
Amit Shah Video Case: అమిత్ షా వీడియో కేసు.. ఐదుగురు తెలంగాణ కాంగ్రెస్ సభ్యులకు బెయిల్
సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను ప్రసారం చేసిన కేసులో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంలోని ఐదుగురు సభ్యులకు మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.