Amarnath Yatra : భారీ వర్షాలు.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత
ముఖ్యంగా పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి యాత్రను ఒక రోజు పాటు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. వాతావరణ మార్పులతో యాత్ర మార్గాల్లో మట్టి తుడిచిపెట్టుకుపోవడం, రాళ్లు కిందపడటం వంటి సమస్యలు తలెత్తడంతో, యాత్రికుల భద్రత దృష్ట్యా అధికారులు అత్యవసర మరమ్మతులు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు.
- Author : Latha Suma
Date : 17-07-2025 - 11:13 IST
Published By : Hashtagu Telugu Desk
Amarnath Yatra: జమ్మూ కాశ్మీర్లో వర్షాలు ఆగేలా లేవు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం అమర్నాథ్ యాత్రపైనా పడింది. గురువారం (జూలై 17) నాటి పరిస్థితుల దృష్ట్యా, యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు రాష్ట్ర సమాచార శాఖ వెల్లడించింది. ముఖ్యంగా పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి యాత్రను ఒక రోజు పాటు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. వాతావరణ మార్పులతో యాత్ర మార్గాల్లో మట్టి తుడిచిపెట్టుకుపోవడం, రాళ్లు కిందపడటం వంటి సమస్యలు తలెత్తడంతో, యాత్రికుల భద్రత దృష్ట్యా అధికారులు అత్యవసర మరమ్మతులు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు.
Read Also: Earthquake : అలాస్కా తీరంలో 7.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ఈ విషయంపై జమ్మూ కాశ్మీర్ ప్రజా సంబంధాల శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రెండు ప్రధాన మార్గాల్లో ట్రాక్లు ప్రభావితమయ్యాయి. పరిస్థితిని సమీక్షించిన తర్వాత, యాత్రను ఒక రోజు నిలిపివేయాల్సిన అవసరం వచ్చింది అని తెలిపింది. కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధురి కూడా ఈ సమాచారం ధృవీకరించారు. ఆయన మాట్లాడుతూ..పహల్గామ్ మరియు బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి ప్రయాణం తాత్కాలికంగా నిలిపివేయబడింది. వాతావరణం చక్కబడితే రేపటి నుంచి యాత్రను పునఃప్రారంభించే అవకాశముంది అని పేర్కొన్నారు.
యాత్ర ప్రారంభం నుండి వేలాది మంది భక్తుల రాక
ఈ ఏడాది జూలై 3న ప్రారంభమైన అమర్నాథ్ యాత్రకు భక్తుల నుండి విశేష స్పందన లభించింది. ఇప్పటి వరకు సుమారు 2.35 లక్షల మంది యాత్రికులు గుహకు చేరుకున్నారు. అలాగే 4 లక్షలకు పైగా భక్తులు ఆన్లైన్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ యాత్ర మొత్తం 38 రోజుల పాటు సాగనుండగా, ఆగస్టు 9న ముగియనుంది.
భద్రతే మొదటి ప్రాధాన్యత
వర్షాల కారణంగా మార్గాల్లో కొందిచోట్ల పొరుగు పర్వతాల నుంచి రాళ్లు పడటం, మట్టిపొరలు తొలగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో అధికారులు వెంటనే మార్గాల పరిశీలన చేసి, అక్కడ అవసరమైన పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ట్రాక్లపై జవాన్లు, రెస్క్యూ టీములు, రోడ్ మెంటెనెన్స్ సిబ్బంది పనిచేస్తున్నారు. అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని యాత్ర నిర్వాహకులు పేర్కొన్నారు. అధికారుల ఈ నిర్ణయం భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం గమనార్హం. వాతావరణ విపరీతంగా ఉండే ఈ ప్రాంతంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కాగా, వర్షాలు తగ్గి వాతావరణం అనుకూలించితే, రేపటి నుంచి యాత్ర మళ్లీ ప్రారంభమయ్యే అవకాశముందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భక్తులు బేస్ క్యాంపుల్లోనే తాత్కాలికంగా నిలిపివేయబడ్డారు. వారికి అవసరమైన సదుపాయాలు అందించేందుకు యాత్ర నిర్వాహకులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
Read Also: Telangana Govt : అంగన్వాడీ పిల్లలకు ప్రతి రోజు ఉప్మా , పాలు ఇవ్వబోతున్న సర్కార్