Wayanad Landslide: వయనాడ్లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..
- Author : Vamsi Chowdary Korata
Date : 07-07-2026 - 3:22 IST
Published By : Hashtagu Telugu Desk
కేరళలోని వయనాడ్ జిల్లాలో భారీ వర్షాల ధాటికి ఘోర ప్రమాదం సంభవించింది. కల్లాడిలోని మీనాక్షి వంతెన సమీపంలో సొరంగం నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలో మంగళవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది వరకు మట్టిపెళ్లల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అనక్కంపొయిల్-కల్లాడి-మెప్పాడి జంట సొరంగం రహదారి పనులు సాగుతున్న క్రమంలో, ఒక్కసారిగా కొండ పైనుంచి భారీగా మట్టి, రాళ్లు విరిగిపడ్డాయి. సమాచారం అందిన వెంటనే జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), అగ్నిమాపక మరియు పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన సుమారు ఎనిమిది మందిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేరళ మంత్రి టి. సిద్దిఖీ స్పందిస్తూ, ఇది ముమ్మాటికి మానవ తప్పిదమేనని విమర్శించారు. వదులుగా ఉన్న మట్టిని తొలగించాలని జూన్ 20వ తేదీనే జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ ఈ ఘటనపై అత్యవసర సమావేశం నిర్వహించి, సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు మంత్రులను ఘటనా స్థలానికి పంపారు.
గత 24 గంటల్లో వయనాడ్ జిల్లాలో 265 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ జిల్లాకు ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంలో 2024లో సంభవించిన పెను విపత్తులో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కురుస్తున్న వర్షం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నప్పటికీ, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.