ఏపీ ప్రజలకు ఉగాది కానుకలు.. చంద్రబాబు సర్కార్ వరుస వరాల జల్లు!
గతేడాది 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో 2,600 పోస్టులతో కొత్త నోటిఫికేషన్కు సిద్ధమైంది.
- Author : Gopichand
Date : 18-03-2026 - 5:01 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu Govt: తెలుగు నూతన సంవత్సరం ‘ఉగాది’ వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండుగ ఉత్సాహం రెట్టింపయ్యింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు అద్భుతమైన కానుకలను ప్రకటించింది. నిరుద్యోగుల నుండి దివ్యాంగుల వరకు, పోలవరం నిర్వాసితుల నుండి మైనార్టీల వరకు అందరికీ లబ్ధి చేకూర్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది.
దివ్యాంగులకు ‘దివ్యాంగ శక్తి’
దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని బుధవారం నుండి అమలులోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇది వారిపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తూ వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించనుంది.
నిరుద్యోగులకు తీపి కబురు
నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్కు ముహూర్తం ఖరారైంది. ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం నాడు సుమారు 10 వేలకు పైగా పోస్టులతో కూడిన క్యాలెండర్ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇందులో గ్రూప్-1 స్థాయి అధికారుల నుండి కానిస్టేబుల్ పోస్టుల వరకు వివిధ విభాగాల్లో భర్తీలు ఉండనున్నాయి. ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగాల భర్తీ చేపడతామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.
మెగా డీఎస్సీ (DSC) దిశగా అడుగులు
గతేడాది 16 వేల పోస్టులతో మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో 2,600 పోస్టులతో కొత్త నోటిఫికేషన్కు సిద్ధమైంది. కేవలం ఈ ఏడాదే కాకుండా రాబోయే మూడేళ్లలో ప్రతి ఏటా డీఎస్సీ ఇచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఐదేళ్ల కాలంలో మొత్తం 25 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
Also Read: Ugadi 2026 : అనుమానాలు రేకెత్తిస్తున్న ‘ పరాభవ నామ సంవత్సరం ‘..మరి పండితులు ఏమంటున్నారంటే !!
పోలవరం నిర్వాసితులకు రూ. 250 కోట్ల పరిహారం
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కష్టాలను తీరుస్తూ ప్రభుత్వం మరో విడత పరిహారాన్ని విడుదల చేసింది. బుధవారం నాడు రూ. 250 కోట్ల నిధులను చెల్లించనున్నారు. ఇప్పటికే దీపావళి, సంక్రాంతి సమయాల్లో రెండు విడతలుగా రూ. 1,980 కోట్లు అందించిన ప్రభుత్వం ఇప్పుడు ఉగాది కానుకగా ఈ మొత్తాన్ని విడుదల చేస్తూ నిర్వాసితుల కుటుంబాల్లో వెలుగులు నింపింది.
రంజాన్ వేళ మైనార్టీలకు అండగా
రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇమామ్లు, మౌజన్ల వేతనాల కోసం ముఖ్యమంత్రి విడుదల చేసిన రూ. 45 కోట్లు కేవలం 20 గంటల వ్యవధిలోనే వారి ఖాతాల్లో జమ అయ్యాయి. పండుగకు ముందే వేతనాలు అందడంతో ముస్లిం మైనార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.