ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు
- Author : Vamsi Chowdary Korata
Date : 16-04-2026 - 2:29 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ఇంటర్ ఫలితాల్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. రెండు చోట్ల కవలలు ఒకేలా మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చాందిని, చర్మిల అనే కవలలు 470 మార్కులకు గాను ఇద్దరూ 459 చొప్పున మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్పేట మండలం కోవిలానికి చెందిన కవలలు భరత్ చరణ్, భవ్యశ్రీ 470 మార్కులకు 447 మార్కులు సాధించారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కవలలు ఒకేలా మార్కులు సాధించి ఔరా అనిపించారు. ఏపీలో కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఇంటర్ పరీక్ష ఫలితాల్లో కవలలు ఒకేలా మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కృష్ణారావు, రేణుక దంపతుల కుమార్తెలు చార్మి, చాందినిలు కవలలు. వీరిద్దరు పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం రేగులపాడు కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. వీరిద్దరు బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 470 మార్కులకు 459 మార్కులు సాధించారు. అంటే ఇద్దరికీ ఒకేలా 459 మార్కులు రావటం విశేషం. చార్మి, చాందినిల తండ్రి కృష్ణారావు శ్రీకాకుళంలో పండ్ల షాపు నడుపుతున్నారు. తల్లి రేణుక ఇళ్లలో పని చేసుకుంటూ కుమార్తెల్ని చదివిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలకు ఒకేలా 459 మార్కులు రావడంతో తల్లిదండ్రులు ఆనందంలో ఉన్నారు. చార్మి, చాందినిలు ఇంజినీర్లుగా స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోనే మరో ఇద్దరు కవలలకు కూడా ఒకేలా మార్కులు వచ్చాయి. ఎల్ఎన్ పేట మండలం కోవిలానికి చెందిన శంభాన భరత్ చరణ్, భవ్యశ్రీలు కూడా కవలలు. వీరిద్దరు ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో 470 మార్కులకు 447 సాధించారు. ఇద్దరికీ ఒకేలా 447 మార్కులు వచ్చాయి. భరత్ చరణ్, భవ్యశ్రీలు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నారు. అటు చార్మి, చాందిని.. ఇటు భరత్ చరణ్, భవ్యశ్రీలు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారే కావటం విశేషం. అది కూడా టాప్ మార్కులు రావడంతో తల్లిదండ్రులు ఆనందంలో ఉన్నారు.
తెలంగాణలోనూ అదరగొట్టిన కవలలు
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జగిత్యాలకు చెందిన సాయి వైభవ్, సాయి వర్షిత్లు కవలలు కాగా వారిద్దరూ ఒకేలా 451 మార్కులు సాధించారు. అలాగే మరికొందరు కవలలు టాప్ మార్క్లతో అదరగొట్టారు. ఈ కవలల మధ్య నాలుగైదు మార్కులు మాత్రమే తేడా ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామడుగు మండలం వెదిరకు చెందిన కవలలు కోరుకండ్ల పల్లవి 996, కోరుకండ్ల ప్రణీత 989 మార్కులు (ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో) సాధించారు. మేడిపల్లి మండలం కట్లకుంటకు చెందిన కవలలు పిల్లలు ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. వారిలో నేహాకు 467 మార్కులు, నిధికి 460 మార్కులు వచ్చాయి. కాల్వశ్రీరాంపూర్ ఆదర్శ పాఠశాలకు చెందిన కవలలు మర్రి అన్విత, అక్షితలు ఇంటర్ ఫస్టియర్లో 456, 455 మార్కులు సాధించారు. ఒకేసారి, ఒకే రూపంతో పుట్టి, ఒకేసారి ఎదిగిన కవలలు ఇప్పుడు పరీక్షల్లో కూడా ఒకేలా మార్కులు సాధించారు. అది కూడా మంచి మార్కులతో అదరగొట్టారు.