తిరుమలలో దివ్వెల మాధురి, తనూజపై పోలీసులకు తితిదే ఫిర్యాదు
- Author : Vamsi Chowdary Korata
Date : 06-03-2026 - 12:21 IST
Published By : Hashtagu Telugu Desk
Divvela Madhuri తిరుమలలో దివ్వెల మాధురి టీటీడీ నిబంధనలు మరోసారి ఉల్లంఘించారు. బిగ్బాస్ ఫేమ్ తనూజ బర్త్ డే కావడంతో.. తిరుమలలో కేక్ కట్ చేయించారు. శ్రీవారి సన్నిధిలో కేక్లపై నిషేధం ఉంది.. అయినా సరే ఓ గెస్ట్ హౌస్లో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై టీటీడీ స్పందించింది.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
తిరుమలలో బిగ్బాస్ ఫేమ్ దివ్వెల మాధురి మరోసారి నిబంధనలు ఉల్లంఘించారు. కొండపైకి కేక్ తీసుకొచ్చి కట్ చేయడంపై వివాదం రేగింది. తాజాగా ఈ అంశంపై టీటీడీ స్పందించింది. ‘దివ్వెల మాధురి, తనూజ అనే ఇద్దరు వ్యక్తులు నిన్న తిరుమలలో బర్త్ డే వేడుకలు చేసుకున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. తిరుమలలో ఇలాంటి వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధించడం జరిగింది. ఆమె ఆ వీడియో చిత్రీకరించి సోషియల్ మీడియాలో పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ పోలీసులుకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు సదరు ఘటనపై విచారణ చేస్తున్నారు’ అంటూ టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి, బిగ్బాస్ ఫేమ్ తనూజలు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. అక్కడ శ్రీవిభవ అతిథిగృహంలో బస చేశారు. అయితే తనూజ పుట్టిన రోజు కావడంతో తిరుమలకు కేక్ తీసుకొచ్చి కట్ చేశారు. ఈ సెలబ్రేషన్స్ను వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. టీటీడీ నిబంధల ప్రకారం తిరుమలకు కేక్ తీసుకెళ్లకూడదుక, కట్ చేయకూడదు. నిబంధనల్ని ఉల్లంఘించి కేక్ తెప్పించి కట్ చేయడంపై టీటీడీ సీరియస్ అయ్యింది. చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో తిరుమలకు వచ్చిన సమయంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు.. ఏకంగా శ్రీవారి ఆలయం ముందు, పుష్కరణి సమీపంలో ఫొటోషూట్ చేయడంపై వివాదం రేగింది. ఈ ఘటనలో తిరుమల పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కేక్ కటింగ్ వివాదం రేగింది. అయితే ఈ వివాదంపై దివ్వెల మాధురి స్పందించాల్సి ఉంది.
టీటీడీ నిబంధనల ప్రకారం తిరుమలలో ఎలాాంటి ఫోటోషూట్లు, రీల్స్ చేయకూడదు, రాజకీయ ప్రసంగాలపై కూడా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనల గురించి తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర మైకులో కూడా ప్రచారం చేస్తున్నారు. అయినా సరే కొందరు మాత్రం పద్దతి మార్చుకోవడం లేదు.. తిరుమలలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇటీవల బిగ్బాస్ ఫేమ్ గీతూ రాయల్ రీల్ చేయడం వివాదం రేపింది. అంతకముందు కూడా తమిళనాడుకు చెందిన ఓ జంట శ్రీవారి ఆలయం దగ్గర ఫోటోషూట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ దంపతులు టీటీడీ నిబంధనల గురించి తెలియదని చెప్పి క్షమాపణలు కోరారు.. అలాగే చేసిన తప్పుకు పరిహారంగా తిరుమల శ్రీవారికి సేవ చేస్తామంటూ ఓ వీడియోను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తిరుమల వచ్చిన భక్తులు నిబంధనల్ని పాటించాలని టీటీడీ సూచిస్తోంది.