ముహుర్తం ఖరారు.. మార్చి 23న అనకాపల్లి స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన..!
- Author : Vamsi Chowdary Korata
Date : 12-03-2026 - 5:00 IST
Published By : Hashtagu Telugu Desk
Arcelormittal Nippon Steel Plant Bhoomi Pooja In Anakapalli ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం రూపురేఖలు మారబోతున్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న మెగా స్టీల్ ప్లాంట్కు మార్చి 23న శంకుస్థాపన జరగనుంది. దాదాపు 60,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టున్నారు. ఈ పరిశ్రమ ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనుంది. అధునాతన టెక్నాలజీ, పర్యావరణహితమైన పద్ధతుల్లో ఇక్కడ ఏటా లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయబోతున్నారు.
ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర ఎకనమిక్ డైనమిక్స్ను పూర్తిగా మార్చేయబోతుంది. దాదాపు 20 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి లభించనుంది. ముఖ్యంగా నక్కపల్లి, పాయకరావుపేట పరిసర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడనున్నాయి. స్టీల్ ప్లాంట్కు అనుబంధంగా వందలాది పరిశ్రమలు తరలిరానున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం సైతం ఊపందుకోనుంది. రవాణా , సేవా రంగాలకు ఊహించని రీతిలో డిమాండ్ పెరగనుంది.
కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్..భారత దేశ ఉక్కు రాజధానిగా మారనుంది. పోర్టు కనెక్టివిటీ సౌకర్యం ఈ స్టీల్ ప్లాంట్కు అతిపెద్ద అడ్వాంటేజ్ కానుంది. ముడి సరుకుల దిగుమతి,ఉక్కు ఎగుమతి మరింత ఈజీ కానుంది. మంత్రి నారా లోకేష్ , సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వేగంగా అనుమతులు మంజూరు చేయడంతో పాటు మౌలిక వసతులను కల్పించారు. మార్చి 23న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుంది. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో కొత్త అధ్యాయం మొదలు కానుంది.